'రేప్'లపై మంత్రి షాకింగ్ కామెంట్స్: ఇళ్లకు తాళాలు వేయమంటారా!?
'రాష్ట్రంలో ప్రతీ ఇంటికి తాళం వేయాలని కోరుకుంటున్నారా? ప్రతీ ఇంటి గుమ్మం వద్ద పోలీసులను కాపలా పెట్టాలా? నేరాలు పెరిగితే మేమేం ఏం చేయగలం' అంటూ ఆయనే ఎదురు ప్రశ్నించారు.
జైపూర్: బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధులుగా ఉండి మహిళా రక్షణకు సంబంధించిన విషయాల్లో నిర్లక్ష్యపూరితంగా వ్యాఖ్యలు చేయడం కలవరపెడుతోంది. తాజాగా ఓ బీజేపీ మంత్రి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపేవిగా మారాయి. అత్యాచారాలను ఎవరు మాత్రం అడ్డుకోగలరంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
బీజేపీ నేత, రాజస్తాన్ నాయకుడు కాళిచరణ్ సరాఫ్ ఈ అనుచిత వ్యాఖ్యలు చేశారు. మైనర్ బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి ఒడిగట్టిన ఘటనపై స్పందిస్తూ.. 'నగల దుకాణంలో పనిచేసే ఒక వ్యక్తి అతని యజమాని కుమార్తెను అత్యాచారం చేస్తే ప్రభుత్వం మాత్రం ఏం చేయగలుగుతుంది?' అంటూ ఆయన నిర్లక్ష్యంగా స్పందించారు.
ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నప్పుడు నిందితుడిపై కేసు నమోదు చేయడం, బాధితురాలికి వైద్యం అందించడం మినహా ఏమి చేయలేమని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాదు, రాజస్తాన్ లో అత్యాచారాలు పెరిగిపోతున్నాయి కదా! అని ప్రశ్నించగా.. 'రాష్ట్రంలో ప్రతీ ఇంటికి తాళం వేయాలని కోరుకుంటున్నారా? ప్రతీ ఇంటి గుమ్మం వద్ద పోలీసులను కాపలా పెట్టాలా? నేరాలు పెరిగితే మేమేం ఏం చేయగలం' అంటూ ఆయనే ఎదురు ప్రశ్నించారు.
మంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలపై విపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయి. బాధ్యతాయుతమైన మంత్రిగా ఉండి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు.