రాజ్యసభలో జీఎస్టీ బిల్లు: మొదలైన చర్చ, జేబులు గుల్ల కావాల్సిందేనా?
న్యూఢిల్లీ: జీఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. జీఎస్టీ సవరణ బిల్లును బుధవారం కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఆమోదం పొందడం ఇక లాంఛనమే అవడంతో ధరలపై దీని ప్రభావం ఎలా ఉంటుందనే చర్చ అప్పుడే మొదలైంది.
వివరాల్లోకి వెళితే... 'ఒకే దేశం.. ఒకే పన్ను' అనే నినాదంతో కేంద్రంలోని ఎన్టీఏ ప్రభుత్వం ఈ బిల్లుని ఆమోదింప జేసుకునేందుకు స్వల్ప సవరణలతో రాజ్యసభలో ఈరోజు ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ఆమోదం పొందితే పన్ను రేటును అనుసరించి వేటి ధరలు పెరగనున్నాయి, వేటి ధరలు తగ్గనున్నాయో తెలుస్తుంది.
ఒకవేళ జీఎస్టీ 18 శాతంగా నిర్ణయిస్తే ఫోన్, కరెంట్ బిల్లు పెరుగుతాయని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ప్రస్తుతం వీటిపై 15 శాతం మాత్రమే పన్ను విధిస్తున్నారు. వీటితో పాటు సామాన్యుడు ఎక్కువగా వినియోగించే సేవల బిల్లులు పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం అత్యవసర సేవలైన ఆరోగ్యం, విద్యలకు మినహాయింపు ఉన్నట్లే జీఎస్టీలోనూ వాటికి మినహాయింపు ఉండే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. దీంతోపాటు టెలికాం, బీమా రంగాలు జీఎస్టీలో తక్కువ పన్ను రేటు(12 శాతం) కేటగిరీలో ఉండొచ్చని నిపుణుల అభిప్రాయం.
జీఎస్టీ బిల్లు అమలు తాత్కాలికంగా రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 0.2 నుంచి 0.7 శాతం పెంచే అవకాశం ఉందని నోమురా అనే ఓ బ్రోకరేజ్ సంస్థ వెల్లడించింది. ఒకవేళ జీఎస్టీ కమిటీ సిఫారసు చేసినట్లే పన్ను రేటు 17 నుంచి 18 శాతం ఉంటే వస్తువుల రేట్లు తగ్గి, సేవల రేట్లు పెరుగుతాయి.
ప్రస్తుతం వస్తువులపై పన్ను రేటు 24 నుంచి 26 శాతం ఉండగా, సేవలపై 15 శాతంగా ఉంది. రాజ్యసభలో జీఎస్టీ బిల్లుపై జరిగిన చర్చలో మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ నేత పి చిదంబరం ప్రసంగిస్తూ వస్తు సేవల పన్ను గరిష్ఠంగా 18 శాతం వరకూ ఉంటే తమకు ఆమోదయోగ్యమని, అంతకన్నా పెంచాలని చూస్తే, ఎట్టి పరిస్థితుల్లోనూ బిల్లును అడ్డుకుని తీరుతామని చెప్పడం విశేషం.