గుజరాత్ సంచలనం: అగ్రవర్ణ పేదలకు 10శాతం కోటా
అహ్మదాబాద్: ఆనందీబెన్ పటేల్ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గుజరాత్లో అగ్రవర్ణాలకు (నాన్ రిజర్వుడ్ కులాలు) చెందిన పేదలకు విద్యా, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది.
గుజరాత్ దివస్ను పుసర్కరించుకుని మే 1 నుంచి కొత్త రిజర్వేషన్ అమలవుతుందని ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఇప్పటికే అమలవుతోన్న 49 శాతం మించబోదని, అగ్రవర్ణాల పేదలకు ప్రకటించిన 10 శాతం కోటా కూడా ఆ పరిధిలోనే అమలవుతుందని తెలిపింది.
దీంతో ఇప్పుడు 49 శాతం రిజర్వేషన్లు పొందుతున్న కులాల ప్రయోజనాలకు కోతపడటం ఖాయంగా కనిపిస్తోంది. దీనిపై భిన్నస్పందనలు వ్యక్తమయ్యే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ఏమేరకు తన నిర్ణయాన్ని సమర్థించుకుంటుందో వేచి చూడాలి.

రిజర్వేషన్ల కోసం పటీదార్ కులస్తులు తీవ్రస్థాయిలో ఆందోళనలు నిర్వహించడం, సమీప భవిష్యత్ లో ఆధిపత్య కులాలుగా కొనసాగుతున్న ఇంకొన్ని కులాలు కూడా ఆందోళనలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం కావడంతో ఆయన ఆమోదంతోనే ఈ నిర్ణయం వెలువడినట్లు సమాచారం. కాగా, హర్యానాలోనూ జాట్ల డిమాండ్లకు తలొగ్గిన మనోహర్ లాల్ ఖట్టర్ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం ఆ వర్గానికి విద్య, ఉద్యోగ నియామకాల్లో 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications