మళ్లీ బేడీలతోనే భారతీయులు-రెండో విమానంలోనూ అవే సీన్స్..!
అమెరికాలో వలసదారులపై కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉరుముతున్నారు. అమెరికా ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు అక్రమ వలసల్ని తరిమేసేందుకు ఆయన తీసుకున్న నిర్ణయం ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారుతోంది. ఇన్నాళ్లు భారత మార్కెట్ ను వాడుకుంటూ తమ ఆయుధాల్ని మనకు అంటగట్టిన అమెరికా.. ఇప్పుడు మనోళ్లు అక్కడ అక్రమంగా వలస ఉంటున్నారంటూ దారుణంగా తరిమేస్తోంది. అంతే కాదు వారి చేతులకు బేడీలు, కాళ్లకు సంకెళ్లు వేసి పంపడం తీవ్ర విమర్శలకు కారణమవుతోంది.

అమెరికా నుంచి భారత్ కు పంపుతున్న విమానాల్లో భారతీయుల్ని చేతులకు బేడీలు, కాళ్లకు సంకెళ్లతో పంపుతున్నారు. గతంలో అమృత్ సర్ కు వచ్చిన తొలి విమానంలోనే ఇలా భారతీయులు బందీలుగా వచ్చారు. తాజాగా మరో 112 మందితో వచ్చిన రెండో విమానంలోనూ అదే పరిస్ధితి. నిన్న సాయంత్రం అమృత్ సర్ కు వచ్చిన రెండో విమానంలో వచ్చిన భారతీయ వలసదారులు ఇలా కనిపించే సరికి స్వదేశంలో జనం ఫైర్ అవుతున్నారు.
వాస్తవానికి అమెరికాలో వలసదారుల్ని భారత్ కు తరిమేసే ప్రయత్నాలు మొదలయ్యాక ప్రధాని మోడీ అక్కడికి వెళ్లి డొనాల్డ్ ట్రంప్ ను కలుస్తానని ప్రకటించారు. ఆ తర్వాత భారత్ కు తొలి విమానం వచ్చింది. ఇందులో భారతీయులు బేడీలు, సంకెళ్లతో కనిపించారు. దీనిపై విమర్శలు వచ్చాయి. దీనిపై ట్రంప్ తో భేటీ లో చర్చిస్తానని మోడీ చెప్పారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడీ వెళ్లి ట్రంప్ ను కలిశారు. ఈ చర్చల్లో వలసల్ని భారత్ కు తరలించడంపై ఇద్దరూ మాట్లాడుకుని ఓ అంగీకారానికి వచ్చినట్లు అంతా భావించారు. కానీ తాజాగా భారత్ కు వచ్చిన వలసదారులు మాత్రం తిరిగి బేడీలతో కనిపించారు.
ఇలా భారతీయులు అమెరికా వంటి దేశం నుంచి బేడీలతో ఇలా స్వదేశానికి రావడం చూస్తే మనోళ్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ పార్టీలు సైతం కేంద్రం తీరుపై మండిపడుతున్నారు. ట్రంప్ తో మోడీ భేటీ తర్వాత కూడా ఇలా జరగడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. నా ఫ్రెండ్ ట్రంప్ ను కలవడానికి వెళ్తున్నా అంటూ చెప్పుకుని వెళ్లిన మోడీ అక్కడ ఆయనకు దీనిపై ఏమీ చెప్పలేదా అని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది.












Click it and Unblock the Notifications