ఐఏఎస్ రవి మృతి కేసు: రంగంలోకి దిగిన సీబీఐ
న్యూఢిల్లీ: అనుమానాస్పదస్థితిలో మరణించిన డి.కే. రవి కేసు దర్యాప్తు చెయ్యాలని సీబీఐ అధికారులకు అధికారికంగా ఆదేశాలు జారీ అయ్యాయి. బుధవారం మధ్యాహ్నం కేంద్ర హోం శాఖ కార్యాలయం నుండి సీబీఐ అధికారులకు లిఖితపూర్వకంగా ఆదేశాలు అందాయి.
మంగళవారం కర్ణాటక ప్రభుత్వం రవి కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగిస్తున్నామని లిఖితపూర్వకంగా కేంద్ర హోం శాఖ కార్యాలయానికి లేఖ వ్రాసి ఫ్యాక్స్ చేసింది. ఈ నేపథ్యంలో కేసు దర్యాప్తు సీబీఐ చేతికి వెళ్లింది. కేసు దర్యాప్తు త్వరగా పూర్తి చెయ్యాలని కేంద్ర హొం శాఖ అధికారులు సీబీఐ అధికారులకు సూచించారు.
కేసు ప్రాథమిక నివేదిక ఆధారంగా ఏ అధికారిని నియమించాలనే విషయాన్ని సీబీఐ డైరెక్టర్ నిర్ణయించనున్నారు. రవి కేసు దర్యాప్తు ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుందనేది సీబీఐ కార్యాలయం అధికారికంగా వెల్లడించవలసి ఉంది. గురువారం నుండి సీబీఐ అధికారులు రంగంలోకి దిగుతారని సమాచారం.
ప్రస్తుం సీబీఐ జాయింట్ డైరెక్టర్ పదవిలో ఉన్న రూప్ కుమార్ దత్త దగ్గర ఇప్పటికే ఐఏఎస్ అధికారి డి.కే. రవి కేసు ప్రాథమిక నివేదిక ఉందని తెలిసింది. కర్ణాటక ఐపీఎస్ క్యాడర్కు చెందిన రూప్ కుమార్ దత్తకు బెంగళూరు నగరంతో పాటు రాష్ట్రంలో అనేక చోట్ల పని చేసిన అనుభవం ఉంది.
రూప్ కుమార్ దత్త అనేక క్లిష్టమైన కేసులు చాకచక్యంగా దర్యాప్తు చేసిన సందర్భాలు ఉన్నాయి. డి.కే. రవి కేసు దర్యాప్తులో సీబీఐ అధికారులు రూప్ కుమార్ దత్త సూచనలు, సలహాలు తీసుకునే అవకాశాలు చాలానే ఉన్నాయి. బెంగళూరు సీబీఐ కార్యాలయంలో ఉన్న అధికారులు మాత్రం రవి కేసు దర్యాప్తులో జోక్యం చేసుకోరని తెలిసింది.