ధర్మసంసద్ లలో విద్వేష వ్యాఖ్యలు-అడ్డుకోని హిమాచల్,ఉత్తరాఖండ్ ప్రభుత్వాలపై సుప్రీం ఫైర్
ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో తాజాగా జరిగిన ధర్మ సంసద్ లలో విద్వేష వ్యాఖ్యల్ని అడ్డుకోవడంలో విఫలమైన ఇరు రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ధర్మ సంసద్ లలో ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని విద్వేష వ్యాఖ్యలు చేస్తుంటే మీరేం చేస్తున్నారని ప్రశ్నించింది.
సుప్రీం కోర్ట్ ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రభుత్వాలపై కొరడా ఝళిపించింది.. ధర్మసంసద్ లలో పదేపదే "ఆమోదయోగ్యం కాని ప్రసంగాలు" చేసినప్పటికీ, ధర్మ సంసద్లను నిర్వహించకుండా నిరోధించడానికి చర్యలు తీసుకోవడంలో వారు విఫలమయ్యారని గమనించారు. మీరు దురదృష్టకర సంఘటనలు, ఆమోదయోగ్యం కాని ప్రసంగాలను నిరోధించాలని సూచించింది. పలు ధర్మసంసద్ లలో వక్తలు ఒకరే అయితే విద్వేష వ్యాఖ్యలు వస్తాయని తమకు తెలియదని రాష్ట్ర ప్రభుత్వాలు సమర్ధించుకోలేవని సుప్రీంకోర్టు పేర్కొంది.
ధర్మసంసద్ లో వక్త ఏం చెప్పబోతున్నారో తెలియకుండా అతన్ని అడ్డుకోలేమంటూ ఉత్తరాఖండ్ తరఫు న్యాయవాది చేసిన వాదనపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ధరమ్ సంసద్ లలో విద్వేషపూరిత ప్రసంగాలకు వ్యతిరేకంగా దాఖలైన వ్యాజ్యాన్ని విచారిస్తున్న సుప్రీంకోర్టు ఇలాంటి ఘటనలను నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకున్నాయో చెప్పాలని కోరింది. ఈ ఈవెంట్ల ప్రకటన ముందే చేశారని, అవి జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారని కోర్టు ప్రశ్నించింది.
పిటిషనర్ల తరపున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ మాట్లాడుతూ ఇప్పుడు రూర్కీలో సంసద్ జరుగుతుందని ప్రకటించారని సుప్రీందృష్టికి తెచ్చారు. దీంతో సిబల్ జరగబోయే మరో సంఘటన గురించి మీకు ముందుగానే చెప్తున్నారని, దాన్ని నిరోధించడానికి ఏ చర్యలు తీసుకున్నారని ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీంతో తాము ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని, నిర్వాహకులను ఈవెంట్ను రద్దు చేసేలా ప్రయత్నిస్తున్నామని న్యాయవాది తెలిపారు. ఈ విషయంలో ఎవరు ఆదేశాలు జారీ చేస్తున్నారనే వివరాలను కూడా సుప్రీంకోర్టు కోరింది. ఇకపై ఇలాంటి ఘటనలు జరిగితే సీఎస్, డీజీపీలతో పాటు సంబంధిత అధికారుల్ని బాధ్యుల్ని చేస్తామని సుప్రీం హెచ్చరించింది.