మేం ఏ తప్పు చేయలే, విద్యార్థిని పదం తప్పుగా పలికారు, యాంటీ సీఏఏ స్కిట్పై షహీన్ స్కూల్ యాజమాన్యం..
స్కూల్ డేకి విద్యార్థులతో పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌర రిజిష్టర్కు వ్యతిరేకంగా స్కిట్ చేయించిన షహీన్ పాఠశాల యాజమాన్యం తమను తాము సమర్థించుకుంది. తప్పు చేయలేదని, నమోదైన కేసుపై న్యాయపరంగా పోరాడుతామని స్పష్టంచేసింది. విచారణ సందర్భంగా స్కూల్ యాజమాన్యాన్ని మంగళవారం పోలీసులు ప్రశ్నించారు.
20 వేల మంది విద్యార్థులు..
ఘటనపై షహీన్ స్కూల్స్ సీఈవో తౌసిఫ్ మడికేరి స్పందించారు. తమకు 9 రాష్ట్రాల్లో 43 విద్యాసంస్థలు ఉన్నాయని పేర్కొన్నారు. 20 వేల మంది విద్యార్థులు చదువుకొంటున్నారని తెలిపారు. గతనెలలో తమ పాఠశాల స్కూల్ డే సందర్భంగా 11 ఏళ్ల విద్యార్థిని అనుకొకుండా పలికిన ఒక పదాన్ని పట్టుకొని తమపై దేశద్రోహం కేసు నమోదు చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. కేసు బుధవారం విచారణకు వస్తుందని, తాము చట్టపరంగా పోరాడుతామని చెప్పారు. కానీ తమ ప్రిన్సిపల్, విద్యార్థి తల్లిని ఇంకా జైలులో ఉంచడం సరికాదని అభిప్రాయపడ్డారు.
సివిల్ డ్రెస్సులో..
దేశద్రోహం కేసు నమోదు చేసిన పోలీసులు గతనెల 30వ తేదీన షహీన్ స్కూల్ ప్రిన్సిపల్ ఫరీదా బేగం, ప్రధాని మోడీపై అవమానకరమైన కామెంట్స్ చేసిన విద్యార్థి తల్లి నజమున్నీషాను అరెస్ట్ చేశారు. మరోవైపు మంగళవారం స్కూల్కు పోలీసులు సివిల్ డ్రెస్సులో వచ్చి విచారించారు. ఇదివరకు యూనిఫాంతో రావడంతో పోలీసులు విమర్శలను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ముగ్గురు పోలీసులు, కర్ణాటక బాలల హక్కుల కమిషన్ సభ్యులు రాగా.. తర్వాత డీఎస్పీ హెచ్ బసవేశ్వర వచ్చి వారితో కలిసి కేసు విచారించారు. స్కిట్ రాసింది ఎవరు..? డైలాగ్స్ ఎవరూ ఇచ్చారనే అంశంపై ఆరాతీశారు. సిబ్బంది, విద్యార్థులు, ఇతరులను పోలీసులు వేధిస్తున్నారని స్కూల్ సీఈవో మడికేరి ఆరోపించారు.
టాలెంటెడ్ గర్ల్..
విద్యార్థిని తల్లి, ప్రిన్సిపల్ అరెస్ట్పై న్యాయపరంగా పోరాడుతామని చెప్పారు. విద్యార్థిని తెలివిగల అమ్మాయి అని, ఉత్తమ ప్రతిభ కనబరుస్తోందని పేర్కొన్నారు. ఆమె తల్లి వింతవు అని.. కష్టాల్లో ఉండి కూడా ఆమెను చదివిస్తున్నారని తెలిపారు. తన తల్లిని పోలీసులు అరెస్ట్ చేసినా.. విద్యార్థిని స్కూల్కు వస్తున్నారని గుర్తుచేశారు. విద్యార్థిని తల్లి, ప్రిన్సిపల్ను బయటకు రప్పించేందుకు న్యాయపోరాటం చేస్తామని పేర్కొన్నారు. తాము చేస్తోన్న పోరాటం మతం కోసం కాదు స్వేచ్చ కోసం, న్యాయం కోసం.. తాము ఏ పరిస్థితుల్లో కూడా భయపడమని స్పష్టంచేశారు. న్యాయం కోసం పోరాడుతనే ఉంటామని తేల్చిచెప్పారు.
ఇదీ విషయం
గతనెల 21వ తేదీన కర్ణాటకలోని బీదర్కు చెందిన షహీన్ ప్రాథమిక, ఉన్నత పాఠశాల స్కూల్ డే నిర్వహించారు. అందులో భాగంగా విద్యార్థులు సీఏఏ, ప్రధాని మోడీ, రాజ్యాంగానికి వ్యతిరేకంగా స్కిట్ చేశారు. దానిని కొందరు ఫేస్బుక్ లైవ్లో ప్రసారం చేయడంతో వెలుగులోకి వచ్చింది. దీనిపై నీలేశ్ అనే స్థానికుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఐపీసీ 124 ప్రకారం స్కూల్ యాజమాన్యంపై దేశ ద్రోహం కేసు నమోదు చేశారు.