స్లీపర్సెల్స్ ఉన్నారు జాగ్రత్త: పళని, పన్నీరుకు దినకరన్ హెచ్చరిక
చెన్నై: అధికార అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన టీటీవీ దినకరన్ తమిళనాడు ముఖ్యమంత్రి పళనస్వామి, డిప్యూటీ సీఎం పన్నీరుసెల్వంలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అన్నాడీఎంకేలో తనకు స్లీపర్ సెల్స్ ఉన్నారని చెప్పారు. ఆ పార్టీ నుంచి తనకు కొందరు రహస్యంగా మద్దతిస్తున్నారని, దీన్ని తెలుసుకుని సీఎం పదవి నుంచి పళనిస్వామి దిగిపోవాలని హెచ్చరించారు.
స్లీపర్ సెల్స్ ఉన్నారు జాగ్రత్త..
అన్నాడీఎంకేలో తనకు మద్దతిస్తున్న రహస్య ఎమ్మెల్యేలను స్లీపర్ సెల్స్(గూఢచారులు)గా పేర్కొన్నారు దినకరన్. ‘పార్టీలో ఒకరి తర్వాత ఒకరు మాకు మద్దతిస్తున్నారు. అందుకే పళనిస్వామి రాజీనామా చేయడానికి మేం టైమ్ ఇస్తున్నాం' అని దినకరన్ స్పష్టం చేశారు.
శశికళకు మాత్రమే..
అంతేగాక సోమవారం జరిగిన అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ గురించి కూడా దినకరన్ స్పందించారు. ఆ సమావేశం న్యాయవిరుద్ధమని అన్నారు. అంతేగాక, ఒక్క శశికళకు మాత్రమే పార్టీ సాధారణ సమావేశాలను నిర్వహించే హక్కు ఉందని స్పష్టం చేశారు.
జైలు కెళ్లడంతో..
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం పార్టీ పగ్గాలను చిన్నమ్మ శశికళ చేపట్టారు. ఆమె అనూహ్యంగా జైలుకెళ్లడంతో పార్టీ బాధ్యతలను తాత్కాలికంగా మేనల్లుడు దినకరన్కు అప్పగించారు. దీంతో అన్నాడీఎంకే పళని స్వామి, పన్నీర్ సెల్వం వర్గాలుగా చీలిపోయింది.
దినకరన్కు గట్టి షాక్
ఇటీవలే పళనీ, పన్నీరు వర్గాలు ఒక్కటయ్యాయి. ఈ నేపథ్యంలో పన్నీర్ వర్గం డిమాండ్ మేరకు పార్టీ నుంచి శశికళ, ఆమె మేనల్లుడు దినకరన్పై బహిష్కరణ వేటు వేశారు. విలీనంపై అసంతృప్తిగా ఉన్న దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు సీఎం పళనిస్వామిపై తిరుగుబాటు చేశారు. దీంతో తమకు 21 మంది ఎమ్మెల్యేల మద్దతుందని పళనిస్వామి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని దినకరన్ డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఆ 21మంది కూడా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలని గవర్నర్ స్పష్టం చేయడంతో దినకరన్కు గట్టి షాక్ తగిలినట్లయింది.