ముంబైలో వర్ష బీభత్సం ... మరో మూడు రోజులపాటు .. సీఎం విజ్ఞప్తి
ముంబై నగరంలో వర్ష బీభత్సం కొనసాగుతుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ముంబైలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. ఒకపక్క కరోనా , మరో పక్క వర్ష బీభత్సంతో ముంబై వాసులు చిగురుటాకుల్లా వణికిపోతున్నారు. భారీ వర్షాలకు నగరంలో పలు ప్రాంతాలు జలమయం కాగా జనజీవనం అస్తవ్యస్తంగా తయారైంది.

ముంబైని ముంచేస్తున్న వర్షం ... కొనసాగుతున్న రెడ్ అలెర్ట్
ముంబై దాని పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కురుస్తున్న వర్షాలకు ముంబై మహా నగరం చిగురుటాకులా వణుకుతోంది. ఇళ్ళలోకి నీరు చేరటంతో ప్రజలు నిరాశ్రయులవుతున్నారు . కుండపోతగా కురుస్తున్న వర్షాలతో ముంబై నగర ప్రజా రవాణా సేవలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మరొకపక్క ముంబై-పూణే లలో రెడ్ అలర్ట్ కొనసాగుతూనే ఉంది. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని బాంబే మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలకు సూచిస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అత్యవసర సేవలు మినహా నుంచి మిగతా షాపులు కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

రంగంలోకి రెస్క్యూ టీంలు .. ప్రజలు బయటకు రావద్దని విజ్ఞప్తి
ముంబైలో తాజా పరిస్థితుల నేపథ్యంలో రెస్క్యూ టీం లను రంగంలోకి దించింది ప్రభుత్వం. సీఎం ఉద్ధవ్ ఠాక్రే అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలకు అవసరమైన చోట సహాయక చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అతలాకుతలమౌతున్న మహారాష్ట్రలో ప్రస్తుతం 16 ఎన్డీఆర్ఎఫ్ టీంలు రంగంలోకి దిగాయి. ముంబైలో ఐదు, సాంగ్లీ లో రెండు, కొల్హాపూర్ లో 4, సతారా , నాగపూర్, రాయగడ్, పాల్ఘర్ , థానేలలో ఒక్కొక్క టీమ్ చొప్పున రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నారు.

నీట మునిగిన దక్షిణ ముంబైలోని కొలాబా ప్రాంతం
దక్షిణ ముంబైలోని కొలాబా ప్రాంతం కురుస్తున్న వర్షాలతో పూర్తిగా నీట మునిగింది. గత నలభై ఆరు సంవత్సరాలలో ఎన్నడూ చూడని వర్షపాతం, ప్రస్తుతం అక్కడ నమోదయింది . నిన్న 107 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులు, కురిసిన వర్షానికి నగర అతలాకుతలమైంది. సబర్బన్ రైలు సేవలకు కూడా విఘాతం కలిగింది. రాబోయే మరికొద్ది గంటల్లో మరింత వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రజలను కోరారు.
Recommended Video

జెజే ఆసుపత్రిలోకి వరద నీరు ... 47 ఏళ్ళలో ఎన్నడూ చూడనంత వర్షం
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జెజే ఆసుపత్రిలోకి వరద నీరు ప్రవేశించింది .1974 వ సంవత్సరం నుంచి ఇప్పటివరకు ఎప్పుడూ కురవనంత వర్షం గత 24 గంటల వ్యవధిలో కురిసింది అని వాతావరణ శాఖ చెబుతోంది . ఇంకా వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది .మహారాష్ట్రలో గత 12 గంటల్లో 293.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ వర్షాలు మరో మూడు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో మహారాష్ట్రలో జనజీవనం వర్షాల ధాటికి వణికిపోతుంది. అస్తవ్యస్తం అవుతుంది.












Click it and Unblock the Notifications