ప్రైవేట్ ఆస్పత్రులకు వ్యాక్సిన్స్ ఎక్కడివి ? కేంద్రానికి ఢిల్లీ సర్కార్ సూటి ప్రశ్న
భారత్లో కరోనా రెండో దశ విజృంభణ నేపథ్యంలో వ్యాక్సిన్ల కొరత వేధిస్తోంది. వ్యాక్సిన్ల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కోల్డ్వార్ నడుస్తూనే ఉంది. వ్యాక్సిన్ స్టాక్లు చూసుకోకుడా మూడో దశ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రకటించిన కేంద్రం అభాసుపాలవుతోంది. కానీ ప్రభుత్వాలకు దొరకని వ్యాక్సిన్లు ప్రైవేటు ఆస్పత్రుల్లో మాత్రం దర్శనమివ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో 18 నుంచి 44 ఏళ్ల వయసు వారికి పరిమిత సంఖ్యలోనే వ్యాక్సిన్లు వేస్తున్న ప్రభుత్వానికి ఇప్పుడు అవి కాస్తా అయిపోవడంతో సమస్యలు తప్పడం లేదు. దీంతో జూన్ 10 వరకూ వ్యాక్సినేషన్ ప్రక్రియను నిలిపేయాల్సిన పరిస్దితి. దీంతో అక్కడి ఆమ్ ఆద్మీ ప్రభుత్వానికి చిర్రెత్తుకొచ్చింది. మాకు అందుబాటులో లేని వ్యాక్సిన్లు ప్రైవేటు ఆస్పత్రులకు ఎలా అందుబాటులో ఉంటున్నాయో చెప్పాలని డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు.

కేంద్రం జూన్లో వ్యాక్సిన్లు ఇస్తామని చెబుతోందని, కాబట్టి జూన్ 10 వరకూ వ్యాక్సిన్లు అందుబాటులో ఉండబోవని సిసిడియా ప్రకటించారు. ఢిల్లీలో 18-44 ఏళ్ల వయసున్న వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు కేంద్రం జూన్లో 5.5 లక్షల డోసులు ఇవ్వనుందని, అయితే ఈ వయోవర్గానికి వ్యాక్సిన్ ఇవ్వాలంటే మొత్తం కోటీ 84 లక్షల డోసులు అవసరమన్నారు. మరోవైపు వ్యాక్సిన్ల కోసం ఢిల్లీ సర్కార్ కూడా ఇతర రాష్ట్రాల మాదిరే గ్లోబల్ టెండర్లకు వెళ్లింది. జూన్ 7లోగా ఆసక్తిగలవారు టెండర్లు వేయాలని కోరుతోంది.
ఇప్పటివరకూ ఢిల్లీ ప్రభుత్వం 18-44 వయస్సున్న వారికి వ్యాక్సినేషన్ కోసం 8.17 లక్షల డోసులు ప్రైవేటుగా సేకరించింది.












Click it and Unblock the Notifications