మోడీపై శశిథరూర్ ప్రశంసలు: మీడియాపై ఫైర్, జయప్రద చేరికపై..
కోల్కతా: ప్రధాని నరేంద్ర మోడీ పైన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ గురువారం ప్రశంసల వర్షం కురిపించారు. మోడీ తీరుకు తాను మంత్రముగ్ధుడునయ్యానని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో అంత భారీస్థాయిలో విజయం సాధిస్తారని తాను అసలు ఊహించలేదన్నారు.
లోకసభ సభ్యుడిగా తాను గెలిచినందుకు మోడీ తనను అభినందించారని, అందుకు ఎంతో సంతోషించానని చెప్పారు. కోల్కతాలో తాను రచించిన ఇండియా శాస్త్ర పుస్తకావిష్కరణ సభలో శశిథరూర్ మాట్లాడారు. మోడీ ఇలాంటి విజయం సాధిస్తారని తాను అనుకోలేదని, ఇది తనను ఆకట్టుకుందన్నారు.
ఎన్నికలకు మూడు నుండి ఎనిమిది నెలల ముందు తన సతీమణి సునంద పుష్కర్ పైన మోడీ చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన గుర్తుకు చేసుకున్నారు. అదే సమయంలో మోడీ ప్రభుత్వాన్ని తప్పు కూడా పట్టారు. వాక్చాతుర్యానికి, వాస్తవానికి మధ్య చాలా తేడా ఉంటుందని చెప్పారు.
జయప్రద, ఇల్మీ, కిరణ్ బేడీల చేరికపై..
బీజేపీని కూడా ఆయన పొగిడారు. ఆ పార్టీలోకి ఎక్కువ మంది మహిళలను తీసుకోవడాన్ని ఆయన హర్షించారు. షాజియా ఇల్మీ, జయప్రద, కిరణ్ బేడీలు బీజేపీలోకి చేరడం పైన స్పందిస్తూ ఆయన పైవిధంగా స్పందించారు.
ఇటీవల ప్రధాని మోడీ స్వచ్ఛ భారత్లో పాల్గొనాలని ఆహ్వానిస్తే ఆయన అంగీకరించారు. స్వచ్ఛ భారత్ ఎంతో మంచి కార్యక్రమమని, తాను దానిని నమ్మానని, అందుకే దానిలో తనవంతు బాధ్యత నిర్వహిస్తానని చెప్పారు. మోడీ ప్రధాని కాకముందు.. ఓ సమయంలో మాట్లాడుతూ.. సునందను రూ.50 కోట్ల గర్ల్ ఫ్రెండ్ అన్నారు. దానిపై థరూర్ కూడా కౌంటర్ ఇచ్చారు. తన భార్య వెలకట్టలేనిదని, మీరు చెబుతున్న రూ.50 కోట్లకు ఎంతో మించిందని ట్వీట్ చేశారు.
మీడియాపై శశిథరూర్ ఆగ్రహం
మీడియా పైన శశిథరూర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజుల్లో చాలా టీవీ ఛానల్స్ బ్రేకింగ్ న్యూస్, సెన్షేషనల్ అంటున్నాయని అభిప్రాయపడ్డారు. ఆ హడావుడిలో వారు వాస్తవాన్ని విస్మరిస్తున్నారన్నారు. టీవీ ఛానల్స్ రోగమే ప్రింటి మీడియాకు సోకిందన్నారు. సునంద మృతి కేసు విషయమై ఆయన మీడియా పైన మండిపడ్డారు.
కాగా శశిథరూర్ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా చర్చనియాంశమయ్యాయి. భార్య సునంద మృతి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న థరూర్ ఉన్నపలంగా ప్రధాని మోదీని పొగడటంతో అనేక ఊహాగానాలకు తెరతీస్తోంది. మరోవైపు ధరూర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. థరూర్ అసందర్భ ప్రసంగానికి పాల్పడుతున్నారంటూ మండిపడింది.