ఫస్ట్టైం: స్కైప్ ద్వారా కేసు విచారించిన మద్రాస్ హైకోర్టు
చెన్నై: ఆన్లైన్ వీడియో చాటింగ్ వెబ్సైట్ స్కైప్ ద్వారా అత్యవసర పరిస్థితుల్లో తొలిసారి ఓ పిటిషన్పై మద్రాస్ హైకోర్టు విచారణ చేపట్టింది. దీపావళి పండగ సెలవులు కావడం, చివరి క్షణంలో ఓ వివాహానికి సంబంధించిన పిటిషన్ విచారణకు రావడంతో మద్రాస్ హైకోర్టు బెంచ్ జడ్జి సలహా మేరకు మధురై బెంచ్కు చెందిన జస్టిస్ ఎస్ విద్యానాథన్ స్కైప్ను ఆశ్రయించక తప్పలేదు.
చైన్నైలోని తన నివాసంలో స్కైప్ ద్వారా కేసు విచారణను చేపట్టి.. రామనాథపురం జిల్లాలోని ఓ చర్చిలో జరుగుతున్న వివాహ కార్యక్రమానికి తగిన రక్షణ కల్పించాలని జస్టిస్ వైద్యనాథన్ ఆదేశాలు జారీ చేశారు.
అదైకళ మాత చర్చి బయట ఎలాంటి ఊరేగింపులు చేపట్టరాదని ఆదేశాల్లో పేర్కొన్నారు. కేసు విచారణ కోసం పిటిషన్కు సంబంధించిన డాక్యుమెంట్లను స్కాన్ చేసి.. ఈ మెయిల్ ద్వారా జస్టిస్ వైద్యనాథన్కు చేరవేశారు.
ఆదేశాల కాపీని కూడా శనివారం రాత్రి 8 గంటల సమయంలో ఈ మెయిల్ ద్వారా పోలీసులకు పంపించారు. ఓ వివాహం విషయంలో చర్చి అథారిటీకి, పిటిషనర్కు మధ్య గొడవ జరిగిందని, ఆ విషయంలో ప్రత్యర్థి వర్గంతో స్థానిక పోలీసులు కుమ్మక్కు కావడంతో చివరి క్షణంలో పిటిషన్ దాఖలు చేశానని న్యాయవాది ఎం జేసు వెల్లడించారు.
చివరిక్షణంలో కేసుపై విచారణ చేపట్టాల్సి రావడం మల్లగుల్లాలు పడుతున్న సిబ్బందికి మద్రాస్ హైకోర్టు అడ్మినిస్ట్రేటివ్ జడ్జి స్కైప్ ద్వారా విచారించాలని ఆలోచన ఇచ్చారని కోర్టు అధికారులు తెలిపారు. స్కైప్ ద్వారా కేసు విచారణ చేపట్టడం మద్రాస్ హైకోర్టు చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.