వ్యాక్సిన్లపై కేంద్రం కొత్త విధానం- రాష్ట్రాల చేతుల్లోకి- ధరలమంట, సామాన్యులకు చుక్కలే
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం నానాటికీ పెరుగుతుండటం, వ్యాక్సిన్ల కొరత, టీకా ఉత్సవ్ విఫలమైన నేఫథ్యంలో కేంద్రం విదేశీ వ్యాక్సిన్లకు అనుమతులు మంజూరు చేస్తోంది. అలాగని విదేశాల నుంచి ఈ వ్యాక్సిన్ల రాకతో భారత్లో కష్టాలు తీరుతాయని భావించడానికి వీల్లేదు. వ్యాక్సిన్ల అమ్మకాలను సరళీకృతం చేసే దిశగా కేంద్రం వేస్తున్న ఈ అడుగులు వ్యాక్సిన్ ధరల మంట పుట్టించడం ఖాయంగా తెలుస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా మిలియన్ల మంది పేదలకు వ్యాక్సిన్లు అందుబాటులో లేకుండా పోతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
వ్యాక్సిన్ల అమ్మకాల సరళీకరణ
దేశవ్యాప్తంగా ఓవైపు కరోనా సెకండ్ వేవ్ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ల కొరత కేంద్రాన్ని వేధిస్తోంది. వ్యాక్సిన్ల ఉత్పత్తి, నిర్వహణ, అమ్మకాల విషయంలో ఇప్పటికే తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న కేంద్రం.. ఇంత జరిగాక ఇప్పుడు విదేశీ వ్యాక్సిన్లకు ద్వారాలు తెరుస్తోంది. వ్యాక్సిన్ల అమ్మకాల సరళీకరణ పేరుతో విదేశీ వ్యాక్సిన్లకు విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చేందుకు సిద్దమవుతోంది. అంతే కాదు రాష్ట్ర ప్రభుత్వాలే నేరుగా కొనుగోళ్లు చేసుకునే వీలు కల్పించబోతోంది. తొలి 30 కోట్ల మందికి మాత్రమే తాము వ్యాక్సిన్లు ఉచితంగా ఇస్తామని, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు 50 శాతం వ్యాక్సిన్లు తయారీ సంస్ధల నుంచే కొనుగోలు చేసుకునే వీలు కల్పిస్తాని ప్రకటించింది.
భారత్లోకి విదేశీ వ్యాక్సిన్ల రాక
ఇప్పటికే భారత్లో అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలని మోడర్నా, సినోవాక్, క్యాడిలా, జాన్సన్ అండ్ జాన్సన్, ఫైజర్తో పాటు పలు విదేశీ వ్యాక్సిన్ల తయారీ సంస్ధలు దరఖాస్తు చేసుకున్నాయి. వీటికి అతి త్వరలో అనుమతిచ్చేందుకు కేంద్రం సిద్దమైంది. దేశవ్యాప్తంగా మూడో విడత వ్యాక్సినేషన్లో భాగంగా 18 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్లు ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో వ్యాక్సిన్ల అమ్మకాలను సరళీకరణ చేస్తోంది. అంటే విదేశాల నుంచి విచ్చలవిడిగా వ్యాక్సిన్లు భారత్లో అమ్ముకునేందుకు వీలు కల్పించబోతోంది. అంతే కాదు వీటిని మార్కెట్ ధరలకే విక్రయించుకునే వీలు కల్పిస్తోంది.
వ్యాక్సిన్ల ధరల మంట తప్పదా ?
ప్రస్తుతం దేశంలో పంపిణీ అవుతున్న సీరం ఇన్స్టిట్యూట్ వ్యాక్సిన్ కోవిషీల్డ్ రూ.150, భారత్ బయోటెక్ వ్యాక్సిన్ కోవాగ్జిన్ రూ.206 రూపాయలకు ఒక్కో డోస్ కేంద్రానికి అమ్ముతున్నారు. కేంద్రం వాటిని ఉచితంగా రాష్ట్రాలకు ఇస్తోంది. కానీ ఇప్పుడు కేంద్రం వ్యాక్సిన్ల కొరతతో వీటిపై సబ్సిడీతో తమకు ఇవ్వాలనే నిబంధన ఎత్తేయబోతోంది. అంటే మార్కెట్ ధరకే వీటిని అమ్ముకునేందుకు తయారీ సంస్ధలకు వీలు కల్పిస్తోంది. ప్రస్తుతం కోవిషీల్డ్ బహిరంగ మార్కెట్లో రూ.1000కు అమ్ముతామని సీరం ఇన్స్టిట్యూట్ ప్రకటించింది. ఇక విదేశీ వ్యాక్సిన్ల ధరలు మరీ దారుణంగా ఉన్నాయి. ఫైజర్ వ్యాక్సిన్ రూ.1431, మోడర్నా వ్యాక్సిన్ రూ.2348-2715, సినోవా వ్యాక్సిన్ రూ.1027, జాన్సన్ అండ్ జాన్సన్ రూ.734 ఉన్నాయి. వీటిలో జాన్సన్ అండ్ జాన్సన్ ధర మాత్రమే ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న కోవిషీల్డ్, కోవాగ్జిన్ ధర కంటే తక్కువగా ఉంది.
సామాన్యులకు అందని ద్రాక్షేనా ?
ప్రస్తుతం సబ్సిడీపై దేశీయ వ్యాక్సిన్ తయారీ సంస్ధల నుంచి వ్యాక్సిన్లు తీసుకుంటున్న కేంద్రం రాష్ట్రాలకు ఉచితంగా వాటిని అందిస్తోంది. కానీ తాజా విధానం ప్రకారం వీటిని కేంద్రం ఇవ్వడం మానేసి వ్యాక్సిన్ తయారీ సంస్ధల నుంచి నేరుగా రాష్ట్ర ప్రభుత్వాలను కొనుక్కోమని చెబుతోంది. అంతే కాదు వీటిని నేరుగా బహిరంగ మార్కెట్లో అమ్ముకునేందుకు వీలు కల్పిస్తోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో వీటి ధరల నిర్ణయాన్ని పెడుతోంది. తద్వారా వ్యాక్సిన్లపై విమర్శల మకిలిని రాష్ట్ర ప్రభుత్వాలకూ అంటించేందుకు సిద్దమవుతోంది. అంతే కాదు వేలకు వేలు ఖర్చుపెడితే కానీ అందుబాటులో లేని వైద్యం తరహాలోనే ఇప్పుడు వ్యాక్సిన్లనూ పేదలకు దూరం చేయబోతోంది. తాజా లెక్కల ప్రకారం కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఒక్కో డోస్కు వెయ్యి చొప్పున రెండు డోస్లకు రెండు వేలు ఖర్చుపెట్టాల్సి ఉంటుంది. ప్రస్తుతం కరోనాతో కుదేలైన పేదలకు ఇది సాధ్యమేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.