కరోనా సెకండ్ వేవ్ తో భయం గుప్పిట్లో భారత్: 47వేలకు చేరువగా కొత్త కేసులు, 200కు పైగా మరణాలు
భారతదేశాన్ని కరోనా సెకండ్ వేవ్ వణికిస్తోంది. గత 24 గంటల్లో 46, 951 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతేకాదు మరణాల సంఖ్య కూడా చాలా ఎక్కువగా నమోదైంది. 213 మంది మరణాలతో జనవరి ఎనిమిదో తేదీ నుండి ఇప్పటివరకు అత్యధిక మరణాలను గత 24 గంటల్లో నమోదు చేసింది. తాజా కరోనా పరిస్థితులను తేలికగా తీసుకోకూడదని, అప్రమత్తంగా ఉండటం అవసరమని నిర్లక్ష్యం చేస్తే మరింత ప్రమాదంలో పడతామని కేంద్రం పదే పదే హెచ్చరిస్తోంది.
గత 24 గంటల్లో 46,951 తాజా కరోనావైరస్ కేసులు
గత 24 గంటల్లో 46,951 తాజా కరోనావైరస్ కేసులు నమోదు కావటం ఆందోళనగా మారింది. మొన్న 43వేల కేసులు నమోదు కాగా ఒక్కరోజులో నాలుగు వేలకు దగ్గరగా కేసుల సంఖ్య పెరిగింది. నవంబర్ 7 నుండి ఇప్పటివరకు నమోదైన రోజువారీ కేసులలో అత్యధిక కేసులు నిన్న ఒక్కరోజే నమోదవడం ఆందోళన కలిగిస్తుంది. దీంతో మొత్తంగా కరోనా కేసులు 1,16,46,081 నమోదయినట్లుగా వైద్య ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం తెలుస్తోంది .
గత 24 గంటల్లో, 213 మరణాలతో అత్యధిక మరణాలు
మొత్తం కేసులలో, ఇప్పటివరకు 1.11 కోట్లకు పైగా ప్రజలు కోలుకున్నారు . మొత్తం 1,59,097 మరణాలు నమోదయ్యాయి.గత 24 గంటల్లో, 213 మరణాలతో అత్యధిక మరణాలు సైతం నిన్న ఒక్కరోజే నమోదయ్యాయి.కోవిడ్ -19 కోసం 2021 మార్చి 21 వరకు మొత్తం 23,44,45,774 నమూనాలను పరీక్షించారు. వీటిలో 8,80,655 నమూనాలను నిన్న పరీక్షించారని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) నివేదిక వెల్లడించింది .
కరోనా కొత్త కేసుల నమోదులో టాప్ 5 రాష్ట్రాలు ఇవే
కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి అత్యధిక కేసులను నమోదు చేసిన మహారాష్ట్ర, తాజా కేసులలో మళ్ళీ అతిపెద్ద సింగిల్-డే జంప్ను చూసింది. 30,535 కొత్త కరోనా కేసులతో మహారాష్ట్రలో కరోనా కేసులు మొత్తం 24,79,682 కు చేరుకున్నాయి.ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో మహారాష్ట్ర తరువాత పంజాబ్ (2,644), కేరళ (1,875), కర్ణాటక(1,715), గుజరాత్ (1,580) నాలుగు రాష్ట్రాలు అత్యధిక కరోనా కేసులు నమోదయ్యాయి.
గత నాలుగు రోజులుగా నలభై వేలకు పైగా కేసులు .. ఆందోళనలో దేశం
గత నాలుగు రోజులుగా 40 వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్న తీరు ఆందోళన కలిగిస్తుంది గత 24 గంటల్లో 20,180 రికవరీలు నమోదు కాగా కేసుల సంఖ్య రికవరీలకు డబుల్ ఎక్కువగా నమోదు కావడం ఆందోళన కలిగిస్తుంది. విపరీతంగా పెరుగుతున్న కేసులతో మరోమారు లాక్ డౌన్ విధిస్తారేమో అన్న భయాందోళన దేశవ్యాప్తంగా ప్రజల్లో వ్యక్తమవుతోంది.