BMC Election: ఓటేసి వేలిపై ఇంక్ చెరిపేశారు..! మహారాష్ట్ర ఎన్నికల్లో షాకింగ్...!
మహారాష్ట్రలోని 29 మున్సిపల్ కార్పోరేషన్లలో ఇవాళ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 7.30 గంటలకు ప్రారంభమైన పోలింగ్ కొనసాగుతోంది. అయితే ఈ ఎన్నికలు హోరాహోరీగా మారడంతో బృహన్ ముంబై కార్పోరేషన్ (బీఎంసీ)లో అధికార మహాయుతి కూటమి థాక్రే సోదరుల నుంచి గట్టిపోటీ ఎదుర్కొంటోంది. ఈ క్రమంలోనే ఇవాళ కొందరు ఓటర్లు ఓటేసిన తర్వాత తమ వేలికి అధికారులు వేసిన ఇంక్ మార్క్ ను చెరిపేసి మళ్లీ ఓటేస్తున్నట్లు ఉద్ధవ్ థాక్రే చేసిన ఆరోపణలు కలకలం రేపాయి.
బిజెపి మరియు దాని మిత్రపక్షాలు బిఎంసి ఎన్నికల ఫలితాన్ని ప్రభావితం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేశాయని, పోలింగ్ ప్రక్రియ యొక్క నిష్పాక్షికతపై ఆందోళనలను లేవనెత్తాయని శివసేన (యుబిటి) చీఫ్ ఉద్ధవ్ థాకరే ఆరోపించారు. పరిష్కరించని ఫిర్యాదులు, ఓటర్ల జాబితాలలో వ్యత్యాసాలు, చెరగని సిరాతో కూడిన అవకతవకలు, ఓట్ల లెక్కింపు విధానంలో మార్పుల్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ పాత్రను ఆయన ప్రశ్నించారు. గతంలో జరిగిన ఎన్నికలలో ఇలాంటి సమస్యలే చోటు చేసుకున్నట్లు ఆయన గుర్తుచేశారు.

ఉద్ధవ్ ఆరోపణలపై స్పందించిన బిజెపి మంత్రి ఆశిష్ షెలార్ .. సిరాను తుడిచివేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
అయితే ఉద్ధవ్, రాజ్ ఠాక్రే ఇద్దరూ ఓటమిని పసిగట్టారని, అందుకే ఈ బూటకపు ఆటలు ఆడుతున్నారని విమర్శించారు.
మరోవైపు మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో సిరా వివాదం నేపథ్యంలో మహారాష్ట్ర ఎన్నికల సంఘం చీఫ్ దినేష్ వాఘ్మారే మాట్లాడుతూ.. ఈ సిరాను ఎన్నికల సంఘం ఉపయోగించిందని, అది చెరగనిదని స్పష్టం చేసింది. ఎవరైనా మళ్లీ ఓటును ట్యాంపరింగ్ చేసి ఓటు వేస్తే, కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వైరల్ అవుతున్న వీడియోలపై విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. మహారాష్ట్రలో ఇవాళ జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు జరగబోతోంది.












Click it and Unblock the Notifications