IPL 2023: ఐపీఎల్ ప్లేఆఫ్స్ తాజా సమీకరణాలివే-టాప్ 2 దాదాపు ఖరారు- 3,4 బెర్తుల రేసులో వీరే..
ఐపీఎల్ లీగ్ దశ ముగింపు దశకు చేరుకుంటోంది. హైదరాబాద్, ఢిల్లీ జట్లకు మరో 4 మ్యాచ్ లు, మిగిలిన 8 జట్లకు మూడేసి మ్యాచ్ ల చొప్పున మిగిలి ఉన్నాయి. వీటిలో ఆయా జట్ల ప్రదర్శన ఆధారంగా ప్లే ఆఫ్ బెర్తులు ఖరారు కావాల్సి ఉంది. ఇప్పటికే పాయింట్ల పట్టికలో అగ్రస్దానంలో ఉన్న గుజరాత్, చెన్నై జట్లకు ప్లే ఆఫ్ అర్హత అవకాశాలు మెరుగ్గా కనిపిస్తుండగా.. మిగతా రెండు బెర్తుల కోసం మిగిలిన జట్లు తీవ్రంగా పోటీ పడుతున్నాయి.
ఈసారి ఐపీఎల్ సీజన్ లో ప్లే ఆఫ్ కు అర్హత అవకాశాల్ని ఓసారి పరిశీలిస్తే.. ఇప్పటికే 8 మ్యాచ్ ల్లో గెలిచి 16 పాయింట్లు సాధించి, మరో మూడు మ్యాచ్ లు మిగిలున్న గుజరాత్ కచ్చితంగా ప్లే ఆఫ్ లోకి అడుగుపెట్టే తొలి జట్టు కాబోతోంది. ఆ తర్వాత స్ధానంలో ఆరు మ్యాచ్ లు గెలిచి, ఓ మ్యాచ్ రద్దయిన నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 13 పాయింట్లతో ఉంది. ఇవాళ ఢిల్లీతో జరిగే మ్యాచ్ లో గెలిస్తే చెన్నై 15 పాయింట్లు సాధించి ప్లే ఆఫ్ అవకాశాలు మరింత మెరుగుపర్చుకోవడం ఖాయం.

ఇక మూడు, నాలుగు బెర్తుల కోసం తీవ్ర పోటీ కనిపిస్తోంది. ఇప్పటికే గత మ్యాచ్ లో బెంగళూరుపై గెలుపుతో ముంబై ఏకంగా ఏడో స్ధానం నుంచి మూడో స్ధానానికి దూసుకెళ్లింది. ఇప్పటికే 12 పాయింట్లు సాధించిన ముంబై తమ తదుపరి మూడు మ్యాచ్ ల్లో మరో ఒకటి లేదా రెండు మ్యాచ్ లు గెలిచినా ప్లే ఆఫ్ అవకాశాలు గణనీయంగా మెరుగుపడతాయి. ప్రస్తుతం నాలుగో స్ధానంలో ఉన్న లక్నో జట్టు మాత్రం తమ మిగిలిన మూడు మ్యాచ్ ల్లో కనీసం రెండు మ్యాచ్ లు గెలిచినా ప్రస్తుతం ఉన్న 11 పాయింట్లకు మరో 4 పాయింట్లు చేర్చుకుని ప్లే ఆఫ్ లో అడుగుపెట్టే అవకాశాలున్నాయి.
ఇక ప్రస్తుతం వరుసగా ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది స్ధానాల్లో పదేసి పాయింట్లతో ఉన్న రాజస్తాన్, కోల్ కతా, ఆర్సీబీ, పంజాబ్ జట్లు తమ తదుపరి మూడు మ్యాచ్ ల్లో మూడింటినీ గెలవడం లేక కనీసం రెండింటిని గెలిచి మెరుగైన రన్ రేట్ సాధిస్తే తప్ప ప్లే ఆఫ్ అవకాశాలపై ఆశలు వదులుకోవచ్చు. ఈ నాలుగు జట్లలో కేవలం రాజస్దాన్ మాత్రమే ప్రస్తుతం పాజిటివ్ రన్ రేట్ తో ఉంది. మిగిలిన జట్లలో మైనస్ రన్ రేట్ తోనే ఉన్నాయి. కాబట్టి ఏ లెక్కన చూసినా ఈ జట్లన్నీ తదుపరి మ్యాచ్ ల్లో విజయాలతో పాయింట్లు, మెరుగైన రన్ రేట్ కూడా సాధిస్తే ప్లే ఆఫ్ లో మిగిలిన రెండు బెర్త్ లకు పోటీదారులుగా ఉంటాయి.












Click it and Unblock the Notifications