Jan Ki Baat exit poll : హిమాచల్ లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ-ఎవరికెన్ని సీట్లంటే..
హిమాచల్ ప్రదేశ్ లో 68 సీట్లకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ, విపక్ష కాంగ్రెస్ మరోసారి హోరాహోరీ తలపడ్డాయి. ఇవాళ ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ లో ఇరు పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొన్నట్లు తెలుస్తోంది. జన్ కీ బాత్ ప్రకటించిన హిమాచల్ ప్రదేశ్ ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో ఇరు పార్టీల మధ్య సీట్ల సంఖ్యలో స్వల్ప తేడా కనిపిస్తోంది.
జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్ ప్రకారం హిమాచల్ ప్రదేశ్ లో అధికార బీజేపీకి విపక్షకాంగ్రెస్ ఈ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చింది. ఎగ్జిట్ పోల్ ఫలితాలను బట్టి చూస్తే బీజేపీకి 32 నుంచి 40 సీట్లు దక్కవచ్చని తేలింది. అలాగే విపక్ష కాంగ్రెస్ కు 27 నుంచి 34 సీట్లు లభించవచ్చని తేలింది. ఈ ఎన్నికల్లో తొలిసారి బరిలోకి దిగిన మూడో పార్టీ ఆప్ ఈసారి ఖాతా తెరవకపోచ్చని జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్ చెబుతోంది. ఇతరులకు మాత్రం రెండు సీట్ల వరకూ దక్కే అవకాశాలున్నాయి.
ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్ లో ప్రజావ్యతిరేకత తీవ్రంగానే ఉంది. అయితే కాషాయ పెద్దల వరుస పర్యటనలు, కేంద్రం నుంచి లభించిన హామీలు ఈ ఎన్నికలపై ప్రభావం చూపినట్లు ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెబుతున్నాయి. అయితే విపక్ష కాంగ్రెస్ మరోసారి బీజేపీపై ఆధిక్యం చాటుకోవడంలో విఫలమైనట్లు ఎగ్జిట్ పోల్స్ చూస్తే తెలుస్తోంది. అదే జరిగితే మాత్రం మరోసారి హిమాచల్ లో పునర్ వైభవం కోసం ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ కు గట్టి ఎదురుదెబ్బగానే భావించవచ్చు.