రాహుల్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాదు-కానీ నిర్ణయాలన్నీ ఆయనవే-కపిల్ సిబల్ ఆరోపణ
కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న సంక్షోభం నానాటికీ తీవ్రమవుతోంది. త్వరలో అధ్యక్ష ఎన్నికలు నిర్వహించే దిశగా ఇప్పటికే అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్న జీ23 అసమ్మతి నేతలు అందుకు అనుగుణంగానే బహిరంగ విమర్శలకు దిగుతున్నారు. ఇవాళ కాంగ్రెస్ యువ నేత రాహుల్ గాంధీని ఉద్దేశించి జీ23 నేతల్లో ఒకరైన కపిల్ సిబల్ సంచలన విమర్శలు చేశారు.
రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడు కాదని, కానీ నిర్ణయాన్నీ ఆయనే తీసుకుంటున్నారని జీ23 నేతల్లో ఒకరైన కపిల్ సిబల్ ఇవాళ సంచలన ఆరోపణలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పనితీరు చూశాక అయినా గాంధీలు ఇప్పుడు కొత్త నాయకత్వానికి మార్గం చూపాలని సిబల్ సూచించారు. ది ఇండియన్ ఎక్స్ప్రెస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిబల్ స్పందిస్తూ.. గాంధీలు నాయకత్వ పదవుల నుండి తప్పుకుని ఇతరులకు అవకాశం ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. గాంధీలు స్వచ్ఛందంగా దూరంగా ఉండాలన్నారు. ఎందుకంటే వారు నామినేట్ చేయబడిన ఒక గ్రూప్ అధికార పగ్గాలను కొనసాగించకూడదని సిబల్ పేర్కొన్నారు. కాంగ్రెస్ వాదులెవరూ దీన్ని అంగీకరించరని ఆయన తెలిపారు.
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక గత ఆదివారం కాంగ్రెస్ పార్టీ సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించింది. అధికారంలో ఉన్న పంజాబ్తో సహా మొత్తం ఐదు రాష్ట్రాల్లో దారుణ ఫలితాలతో కుంగిపోయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆదివారం ఐదు గంటల పాటు సుదీర్ఘ సమావేశాన్ని నిర్వహించింది. ఇందులో పార్టీ సభ్యులు సోనియా గాంధీ నాయకత్వంపై తమ విశ్వాసాన్ని ఉంచారు. దీంతో ఇప్పటికే పాటిస్తున్న యథాతథ స్థితి కొనసాగించేందుకు మిగతా నేతలు కూడా అంగీకరించక తప్పలేదు.