India Today-Axis My India: అక్కడ బీజేపీ ఖాతా తెరవడమే కష్టం: అధికార పార్టీదే ప్రభంజనం
న్యూఢిల్లీ: ఇటీవలే ముగిసిన నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడటం ఆరంభమైంది. పశ్చిమ బెంగాల్లో చివరిదశ పోలింగ్ ముగిసిన అరగంట తరువాత ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడవుతున్నాయి. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన మీడియా హౌస్లు, ఎన్నికల సర్వేల ఫలితాలను వెల్లడిస్తున్నాయి. అందరి కళ్లూ ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపైనే నిలిచాయి.
ABP-C voter exit polls: బెంగాల్లో దీదీ హ్యాట్రిక్: బీజేపీకి నో ఛాన్స్: ఎవరికెన్ని సీట్లు
కేరళలో అధికార పార్టీదే హవా వీచిందని, ప్రస్తుతం అధికారంలో ఉంటోన్న వామపక్షాల సారథ్యంలోని లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (LDF)కు ఓటర్లు మరోసారి పట్టం కట్టారని ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా (India Today-Axis My India) ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి. ముఖ్యమంత్రి పినరయి విజయన్ సారథ్యంలోని ఎల్డీఎఫ్ కూటమికి మలయాళీలు మరోసారి జైకొట్టారని అంచనా వేసింది. పినరయి విజయన్ ప్రభుత్వంపై వచ్చిన గోల్డ్ స్మగ్లింగ్ కేసులను ప్రజలు పెద్దగా విశ్వసించలేదని, దాన్ని ఏ మాత్రం పట్టించుకోలేదని అభిప్రాయపడింది.
కేరళలో అధికార ఎల్డీఎఫ్ తిరుగులేని మెజారిటీతో వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయంగా కనిపిస్తోందని ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా పోల్ సర్వే అంచనా వేసింది. కేరళలో గట్టిపోటీ ఇవ్వడానికి విశ్వప్రయత్నాలు చేసిన భారతీయ జనతా పార్టీ ఖాతా తెరవడం కూడా కష్టమేనని అభిప్రాయపడింది. కనాకష్టంగా ఒకటి లేదా రెండు స్థానాలను గెలుచుకోవచ్చని స్పష్టం చేసింది. కాంగ్రెస్ సారథ్యంలోని యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (UDF) ప్రతిపక్ష స్థానానికే పరిమితమౌతుందని ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా తెలిపింది.
ముఖ్యమంత్రి పినరయి విజయన్.. వరుసగా రెండోసారి ప్రభుత్వ పగ్గాలను అందుకుంటారని అభిప్రాయపడింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ను దాటి.. భారీగా అసెంబ్లీ స్థానాలను ఎల్డీఎఫ్ గెలుచుకుంటుందని పేర్కొంది. 140 అసెంబ్లీ స్థానాలు ఉన్న కేరళలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 71 సీట్లు అవసరం అవుతాయి. ఈ మేజిక్ ఫిగర్ను దాటి వందకు పైగా నియోజకవర్గాలను ఎల్డీఎఫ్ అందుకుంటుందని తెలిపింది.
అధికార ఎల్డీఎఫ్- 104 నుంచి 120 వరకు అసెంబ్లీ స్థానాల్లో విజయఢంకా మోగిస్తుందని అంచనా వేసింది. యూడీఎఫ్ కేవలం 20 నుంచి 36 స్థానాలను అందుకోగలుగుతుందని తెలిపింది. ఈ ఎన్నికలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కమలనాథులు ఒక్క సీటును గెలుచుకున్నా గొప్పేనని తెలిపింది. బీజేపీకి రెండు స్థానాలు మాత్రమే దక్కే అవకాశం ఉందని ఇండియా టుడే-మై యాక్సిస్ ఇండియా పోల్ సర్వే అంచనా వేసింది. దీన్ని బట్టి అంచనా వేస్తే.. ఎల్డీఎఫ్ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం ఖాయమే అవుతుంది. కాంగ్రెస్ తన ఓటు శాతాన్ని, సీట్లను భారీగా కోల్పోయినట్టవుతుందని అంచనా వేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎదురైన ఫలితాలే అసెంబ్లీలో ప్రతిబింబించినట్లు తెలిపింది.