కోవిడ్ మృతదేహాల దెబ్బ-యూపీ, ఎంపీ నదుల్లో చేపలకు కోల్కతాలో తగ్గిన గిరాకీ
ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్లోని పలు నదుల్లో ఈ మధ్య కోవిడ్ మృతదేహాలు కుప్పలుతెప్పలుగా బయటపడుతున్నాయి. కోవిడ్తో చనిపోయిన వారిని పుణ్యనదుల్లో పడేస్తే వారు పవిత్రులు అవుతారన్న పుకార్లతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నదుల్లో మృతదేహాలు బయటపడుతున్న నేపథ్యంలో ఇక్కడి చేపలకు ఇతర రాష్టాల్లో గిరాకీ అమాంతం పడిపోతోంది.
ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్టాల్లోని నదుల నుంచి దాదాపు మూడున్నర నుంచి నాలుగు టన్నుల చేపలు పశ్చిమబెంగాల్లోని కోల్కతా మార్కెట్కు రైళ్లలో వస్తుంటాయి. నదుల చేపలు కావడంతో బెంగాల్లో వీటికి మంచి డిమాండ్ ఉంటుంది. కానీ తాజాగా గంగానదితో పాటు ఈ రెండు రాష్ట్రాల్లోని పలు నదుల్లో కోవిడ్ మృతదేహాలు బయటపడటంతో, అదీ భారీ స్ధాయిలో కావడంతో వీటిలో లభించే చేపలు తింటే తమకు కూడా వైరస్ సోకుతుందని కోల్కతా వాసులు బెంబేలెత్తుతున్నారు.
వాస్తవానికి కోల్కతా మార్కెట్కు యూపీ, ఎంపీ నుంచే కాక గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా భారీ ఎత్తున చేపల రవాణా జరుగుతుంటుంది. యూపీ, ఎంపీ నదుల్లో చేపలకు కోవిడ్ వైరస్ సోకి ఉండొచ్చన్న భయాలతో మిగతా రాష్ట్రాల నుంచి వస్తున్న చేపలకు డిమాండ్ పెరిగినట్లు తెలుస్తోంది. ఆయా మార్కెట్ల నుంచి వస్తున్న భిన్నరకాల చేపల్ని ఇక్కడి ప్రజలు ఎంతో ఆస్వాదిస్తుంటారు. కానీ తాజా పరిస్ధితులతో పరిస్ధితి ఒక్కసారిగా తారుమారైనట్లు తెలుస్తోంది. మరికొన్నిరోజులు ఇవే పరిస్ధితులు ఉండొచ్చని చెప్తున్నారు.