టీపై నిరసన: ప్రధానికి చేతికి కోట్ల రాజీనామా లేఖ
న్యూఢిల్లీ: మంత్రి పదవికి రాజీనామా చేస్తూ రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి లేఖను ప్రధాని మన్మోహన్ సింగ్కు అందజేశారు. రాయలసీమకు చెందిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తెలంగాణ నోట్ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించడాన్ని నిరసిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేశారు. సూర్యప్రకాష్ రెడ్డి శుక్రవారం సాయంత్రం ప్రధాని మన్మోహన్ సింగ్ను కలిసి రాజీనామా లేఖను అందించారు.
తన రాజీనామాను ఆమోదించాలని ప్రధానిని కోరినట్లు ఆయన మీడియా ప్రతినిధులతో భేటీ అనంతరం తెలిపారు. తమ ప్రాంత ప్రజల ఆకాంక్ష మేరకే రాజీనామా చేసినట్లు తెలిపారు. తమ ప్రాంతానికి అన్యాయం జరిగినందుననే రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. తమ ప్రాంత ప్రజల పరిస్థితిని ప్రధానికి వివరించినట్లు తెలిపారు. తాను కాంగ్రెసు పార్టీలోనే ఉంటానని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చెప్పారు.
కోస్తాంధ్రకు చెందిన మరో కేంద్ర మంత్రి పళ్లం రాజు శుక్రవారం సాయంత్రం మంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారు. ఆయన రాజీనామా లేఖను సమర్పించడానికి ప్రధాని మన్మోహన్ సింగ్ అపాయిట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. మరో కేంద్ర మంత్రి చిరంజీవి కూడా రాజీనామా చేశారని అంటున్నారు. ప్రధాని ఫోన్ చేసి రాజీనామాను ఉపసంహరించుకోవాలని చిరంజీవిని కోరినట్లు, అందుకు చిరంజీవి నిరాకరించినట్లు చెబుతున్నారు.
తెలంగాణ నోట్ ఆమోదాన్ని వ్యతిరేకిస్తూ సీమాంధ్ర కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు కూడా రాజీనామా చేసినట్లు వార్తలు వచ్చాయి. అలాగే, పురంధేశ్వరి, కిల్లి కృపారాణి కూడా రాజీనామాలు చేసినట్లు చెబుతున్నారు. ఎవరు వాస్తవంగా రాజీనామా చేశారు, ఎవరు చేయలేదనే విషయంపై అయోమయ పరిస్థితే ఉంది. పురంధేశ్వరి ఫ్యాక్స్ ద్వారా ప్రధానికి రాజీనామా లేఖను పంపినట్లు వార్తలు వచ్చాయి.
కాగా, తాను రాజీనామా చేయబోమని సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి చెప్పారు. కిశోర్ చంద్రదేవ్, జెడి శీలం కూడా రాజీనామాలకు సిద్ధంగా లేరని తెలుస్తోంది.