ప్రేమ..పెద్దల అభ్యంతరం.. కన్నీళ్లు తెప్పించే క్లైమాక్స్
చెన్నై : వారిద్దరూ ప్రేమించుకున్నారు.. అన్ని ప్రేమ కథల్లో లాగే ఇంట్లో పెద్దలు అడ్డు చెప్పారు. పెద్దలను ఎదిరించే ధైర్యం చేయలేక చివరికి విగత జీవులుగా రైలు పట్టాలపై కనిపించారు. విషయం తెలుసుకున్న ఇరు కుటుంబాల పెద్దలు కన్నీరు మున్నీరవగా, ఘటన జరిగిన కొత్తనూర్ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
వివరాల్లోకి వెళితే.. కోథగిరి శివనాథపురానికి చెందిన పరమేశ్వరన్ కుమార్తె రమ్య (19), అదే ప్రాంతానికి చెందిన రాజమాణిక్యం కుమారుడు దివాకరన్ (20)లు గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే వీరి ప్రేమ వివాహానికి ఇరు కుటుంబాల పెద్దలు అభ్యంతరం చెప్పారు. దీంతో మనస్తాపం చెందిన ఇద్దరు కోయంబత్తూర్ సమీపంలోని కొత్తనూర్ లో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది.
అనంతరం ఘటనా స్థలంలో దొరికిన సర్టిఫికెట్ల ఆధారంగా మృతదేహాలను గుర్తించారు పోలీసులు. తర్వాత వైద్య పరీక్షల నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించి, ఇరు కుటుంబాలకు సమాచారమిచ్చారు. దీంతో ఆసుపత్రికి చేరుకున్న ఇరు కుటుంబాల పెద్దలు మృతదేహాలను చూసి కన్నీటి పర్యంతమయ్యారు. విచారణ ప్రారంభించిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.