సోనియాపై తీవ్ర వ్యాఖ్య, దుమారం: సభలో కేంద్రమంత్రి క్షమాపణ
న్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పైన చేసిన వ్యాఖ్యలకు కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ సోమవారం నాడు క్షమాపణలు చెప్పారు. దీంతో వివాదం సద్దుమణిగింది. సోనియా తెల్లతోలు వల్లే కాంగ్రెస్ ఆమెను అధ్యక్షురాలిగా ఆమోదించారని, రాజీవ్ గాంధీ నైజీరియన్ను పెళ్లాడితే ఆమెను అధ్యక్షురాలిగా అంగీకరించేవారా అన్నారు. దీనిపై వివాదం తలెత్తింది. ఆ వ్యాఖ్యలపై ఈ రోజు ఆయన క్షమాపణలు చెప్పారు.
కాగా, బడ్జెట్ సమావేశాల రెండో దశలో భాగంగా లోకసభ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ మొదలైన వెంటనే సింగపూర్ నిర్మాత లీ క్వాన్యున్, మరో ఇద్దరు మాజీ ఎంపీల మృతికి సభ సంతాపం తెలిపింది. లోకసభకు ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ హాజరయ్యారు.
గిరిరాజ్ వ్యాఖ్యలపై దుమారం
సోనియా పైన గిరిరాజ్ చేసిన వ్యాఖ్యల విషయమై విపక్షాలు ధ్వజమెత్తాయి. మహిళల పట్ల అధికార బీజేపీకి గౌరవం లేదని జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. మంత్రులను ప్రధాని మోడీ కట్టడి చేయడం లేదని చెప్పారు. బీజేపీ ఎంపీలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నా ప్రధాని మౌనం ఎందుకని ప్రశ్నించారు. గిరిరాజ్ వ్యాఖ్యలపై మోడీ సమాధానం చెప్పాల్సిందే అన్నారు. సోనియానే టార్గెట్ చేస్తే సామాన్య మహిళల పరిస్థితి ఏమిటన్నారు.

దీనిపై పార్టీ తరఫున వెంకయ్య నాయుడు స్పందించారు. గిరిరాజ్ వ్యాఖ్యలను తాము ఎట్టి పరిస్థితుల్లోను సమర్థించమని చెప్పారు. అలాంటి వ్యాఖ్యలు సరికాదని సభాపతి అన్నారు. అనంతరం గిరిరాజ్ తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారు. తనకు సోనియాను కించపరిచే ఉద్దేశ్యం లేదన్నారు. దాంతో వివాదం సద్దుమణిగింది.
లోకసభ ముందుకు భూసేకరణ చట్టం
లోకసభ ముందుకు భూసేకరణ చట్టం వచ్చింది. దీనిని కేంద్రమంత్రి రాజీవ్ ప్రతాప్ రూఢీ సోమవారం నాడు ప్రవేశ పెట్టారు. అనంతరం లోకసభను రెండు గంటల వరకు వాయిదా వేశారు. అంతకుముందు ప్రధాని మోడీ మాట్లాడుతూ... భూసేకరణ చట్టానికి అందరు సహకరించాలని కోరారు.












Click it and Unblock the Notifications