ప్రధాని మోడీ డిజిటల్ ఇండియా కార్యక్రమం ఆర్థిక లావాదేవీల్లో పెనుమార్పులు తీసుకొచ్చింది
ఢిల్లీ: మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ డిజిటల్ ఇండియా కార్యక్రమానికి పెద్ద పీట వేసింది. డిజిటల్ ఇండియా కార్యక్రమంతోనే దేశంలో పెద్ద ఎత్తున ఆర్థికలావాదేవీలు డిజిటల్ విధానంలో జరుగుతున్నాయి. నేరుగా నోట్ల పద్దతి ద్వారా జరిగే లావాదేవీలు తగ్గుముఖం పట్టాయి. ఆర్థిక లావాదేవీలు డిజిటల్ పద్ధతి ద్వారా జరగుతుండటంతో ఆన్లైన్ పేమెంట్ ప్లాట్ఫామ్లు వచ్చాయి.
ప్రధాని నరేంద్రమోడీ ప్రవేశ పెట్టిన డిజిటల్ ఇండియా, స్టార్ట్ అప్ ఇండియా కార్యక్రమాలు, పెద్దనోట్ల రద్దుతోనే డిజిటల్ లావాదేవీలు దేశంలో ఊపందుకున్నాయి. డిజిటల్ లావాదేవీలు చేసిన వారికి ఎన్నో బహుమతులు ప్రకటించి తద్వారా నగదు రహిత ఆర్థిక వ్యవస్థను ప్రమోట్ చేసింది కేంద్రం. డిజిటల్ పద్ధతుల ద్వారా ఆర్థిక లావాదేవీలు సులభతరం కావడమే కాదు... నగదు లావాదేవీలపై కూడా ప్రభుత్వం ఓ కన్నేసి ఉంచేందుకు ఉపయోగపడుతుంది. ఇది తిరిగి పన్ను ఎగవేతకు చోటులేకుండా ప్రభుత్వ ఖజానా పెరిగేందుకు దోహదపడుతుంది. డిజిటల్ లావాదేవీలతో చాలామంది పన్ను ఎగవేతదారులను గాడిలోకి తీసుకొస్తుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తరుచూ చెబుతూ ఉంటారు. ప్రభుత్వం తీసుకొచ్చిన డిజిటల్ లావాదేవీలతో పన్ను వసూళ్లు మరింత పెరిగాయి.
డిజిటల్ లావాదేవీలతో మరో ఉపయోగం కూడా ఉంది. ప్రజలు నగదును పెద్ద మొత్తంలో తమతో తీసుకెళ్లాల్సిన పనిలేదు. డబ్బుల కోసం ఏటీఎంల దగ్గర పెద్ద క్యూలలో నిలుచోవాల్సిన పని లేదు. ఒకరు ప్రయాణం చేస్తున్న సమయంలో కూడా ఇది చాలా సురక్షితం.డిజిటల్ లావాదేవీల్లో 2011లో మనదేశం 36వ స్థానంలో ఉండగా... 2018 నాటికి అది 28వ స్థానానికి చేరుకుంది. అయితే ఈ ర్యాంకు మరింత మెరుగుపడాల్సి ఉంది. ప్రభుత్వ ఈ పేమెంట్లలో దేశం దూసుకుపోతోంది. సిటిజన్ టు గవర్నమెంట్, బిజినెస్ టు గవర్నమెంట్, గవర్నమెంట్ టు బిజినెస్ లావాదేవీలు చాలా మెరుగ్గా చురుగ్గా జరుగుతున్నాయి. మోడీ సర్కార్లోనే మొబైల్ ఛార్జీల ధరలు కూడా దిగొచ్చాయి.
డేటా వినియోగంలో కూడా వినియోగదారులు చాలా ఆసక్తి చూపుతున్నారు. డేటా ధరలు తగ్గుముఖం పట్టడంతో గతేడాది నెలకు డేటా వినియోగం 1.5 బిలియన్ గిగాబైట్లకు చేరుకుంది. ఈ విషయాన్ని నీతి ఆయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ స్వయంగా వెల్లడించారు. జూలై 1, 2015లో ప్రధాని నరేంద్ర మోడీ డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించారు. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగానే చాలా స్కీములు పురుడుపోసుకున్నాయి. ఇందులో ఉడాన్, ఉజాలాతో పాటు చాలా ఉన్నాయి. డిజిటల్ ఇండియా కార్యక్రమం ద్వారా 2,50,000 గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలని అది కూడా 2019కల్లా ఇవ్వాలనే దృఢ సంకల్పంతో మోడీ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందుకోసం 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్లో రూ.3,073 కోట్లు కేటాయించడంతో పాటు పెద్ద సంఖ్యలో ఉపాధి కల్పించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది.