మోడీకి అసలు ప్రత్యర్ధులు వారే-ఆ ఇధ్దరు సీఎంల సవాల్-ఐదు రాష్ట్రాల ఫలితాల ఎఫెక్ట్
2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్ గా భావించిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు దాదాపుగా వచ్చేశాయి. ఇందులో యూపీతో పాటు ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రూపంలో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేయగా.. కేవలం పంజాబ్ లో ఆప్ కు ఘనవిజయం దక్కింది. అయితే ఈ ఫలితాలతో ప్రధాని మోడీకి భవిష్యత్ ప్రత్యర్ధులు ఆవిర్భవించారన్న ప్రచారం జరుగుతోంది.
నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ స్వీప్
దేశంలోని యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా అసెంబ్లీలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పంజాబ్ మినహా నాలుగు రాష్ట్రాల్లో సత్తా చాటుకుంది. యూపీ నిలబెట్టుకుంటే గొప్ప అని విమర్శించిన ప్రత్యర్ధులకు చుక్కలు చూపిస్తూ దేశంలోనే అతిపెద్ద రాష్ట్రాన్ని మరోసారి అనాయాసంగా తమ ఖాతాలోకి వేసేసుకుంది.
అంతే కాదు ఐదేళ్లలో మూడు ముఖ్యమంత్రుల్ని మార్చిన ఉత్తరాఖండ్ తో పాటు నిత్యం కప్పల తక్కెడ రాజకీయాలతో అలరారే చిన్న రాష్ట్రాలు గోవా, మణిపూర్ లను సైతం తమ ఖాతాలోకి వేసేసుకుంది. ఇక మిగిలిన రాష్ట్రం పంజాబ్ లో బీజేపీ విజయంపై ముందునుంచీ ఎవరికీ ఆశలు లేవు.
అసలు హీరోలు వారే
వాస్తవానికి ఈ ఎన్నికల్లో నాలుగు చోట్ల బీజేపీ, ఓ చోట ఆప్ గెలిచినా అసలు హీరోలుగా మాత్రం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ మిగిలిపోయారు. ఎందుకంటే యూపీలో ఐదేళ్ల పాటు ప్రభుత్వాన్ని నడిపి ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని అంతా ఓ నిర్ణయానికి వచ్చేసిన పరిస్ధితుల నుంచి తిరిగి అదే రాష్ట్రంలో పాత మెజారిటీకి సమీపంలోకి బీజేపీని తీసుకురావడం ఇప్పుడు యోగీ సత్తా ఎంటో తేల్చేసింది. ప్రధాని మోడీ డబుల్ ఇంజన్ మాటల కంటే క్షేత్రస్ధాయిలో యోగీ వ్యూహాలే ఎక్కువగా ఫలితమిచ్చాయని బీజేపీ నేతలు సైతం చెప్పుకుంటున్నారు.
అలాగే పంజాబ్ లో భగవంత్ మాన్ ను సీఎం అభ్యర్ధిగా ఎంచుకోవడం మొదలుపెట్టి అరవింద్ కేజ్రివాల్ పన్నిన ఏ వ్యూహం కూడా విఫలం కాలేదు. దీంతో సహజంగానే ఆప్ పంజాబ్ లో సాధించిన ఘన విజయం ఇప్పుడు కేజ్రివాల్ ను జాతీయ నేతగా నిలబెట్టబోతోంది.
Recommended Video
మోడీకి సిసలైన ప్రత్యర్ధులు వీరే?
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రధాని మోడీకి కచ్చితంగా ఇద్దరు నేతల నుంచి పెను సవాళ్లు ఎదురుకాబోతున్నాయి. ఇందులో ఒకరు యోగీ ఆదిత్యనాథ్ అయితే మరొకరు అరవింద్ కేజ్రివాల్. బీజేపీలో మోడీ తర్వాత అంతస్ధాయిలో జనాకర్షణ కలిగిన నేతగా యోగీ ఆదిత్యనాథ్ తాజాగా ఆవిర్భవించారు. నిన్న మొన్నటి వరకూ మోడీ తర్వాత బీజేపీలో ఎవరనే ప్రశ్నకు ఇప్పుడు యోగీ అసలైన సమాధానంగా కనిపిస్తున్నారు. దీంతో మోడీ స్ధానాన్ని యోగీ ఎప్పుడు ఆక్రమిస్తారనే చర్చ మొదలుకాబోతోంది. దీన్ని ముందే ఊహించిన మోడీ, అమిత్ షా ద్వయం ఆయన్ను అయోధ్యకు బదులుగా గోరఖ్ పూర్ నుంచే బరిలోకి దించారనే వాదన కూడా ఉంది. ఇప్పుడు యూపీ ఫలితాల తర్వాత మోడీ, యోగీ మధ్య ఈ విషయంలో పోరు ప్రారంభమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
మరోవైపు జాతీయ రాజకీయాల్లో మోడీకి సవాల్ విసురుతున్న నేతల్లో మమత, కేసీఆర్, తర్వాత కేజ్రివాల్ కూడా ఉన్నారు. ఇప్పటికే ఢిల్లీలో వరుసగా మూడుసార్లు బీజేపీని ఓడించి తన సత్తా చాటుకున్న కేజ్రివాల్ ను ఏం చేయాలో తెలియక మోడీ తలపట్టుకుంటున్నారు. అయితే మమత, కేసీఆర్ తరహాలో సొంత రాష్ట్రానికే పరిమితం కాకుండా మరో రాష్ట్రంలో అధికారంలోకి రావడం ద్వారా కేజ్రివాల్ మోడీకి సిసలైన ప్రత్యర్ధిగా నిరూపించుకోబోతున్నారు. మరి యోగీ, కేజ్రివాల్ ను అడ్డుకునేందుకు ప్రధాని మోడీ ఏం చేయబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తి రేపుతోంది.