యూపీలో సీన్ రివర్స్- వీరికే ఎడ్జ్..! తేల్చేసిన ఇండియాటుడే తాజా సర్వే..!
ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ నిరసనల తర్వాత దేశంలో వేగంగా మారుతున్న పరిణామాల్ని అంచనా వేసేందుకు సర్వే సంస్ధలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఇండియా టుడే-సీ ఓటర్ తో కలిసి ఉత్తర్ ప్రదేశ్ లో (Uttar Pradesh) మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వే (MOTN Survey) నిర్వహించింది. ఇందులో షాకింగ్ ఫలితాలు వెలుగుచూశాయి. యూపీలో ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే అధికార బీజేపీ (BJP) కంటే విపక్ష ఇండియా కూటమికే (India Bloc) ఆధిక్యం దక్కబోతున్నట్లు ఈ సర్వే తెలిపింది.
ఉత్తరప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నట్లు ఆగస్టులో నిర్వహించిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే తెలిపింది. దేశంలోనే అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్లో అధికార బీజేపీ కూటమి కంటే ప్రతిపక్ష ఇండియా కూటమికే ఎక్కువ మంది ఓటర్లు మొగ్గు చూపుతున్నట్లు వెల్లడైంది. ఈ ఏడాది జనవరి నెల అంచనాలతో పోలిస్తే అధికార కూటమికి ఇది ఒక పెద్ద ఎదురుదెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు. యూపీలోని మొత్తం 80 లోక్సభ స్థానాల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి ఏకంగా 41 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని ఈ సర్వే స్పష్టం చేసింది. అదే సమయంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 38 స్థానాలకే పరిమితం కానుంది.

ఓట్ల శాతం పరంగా చూస్తే ఎన్డీఏకు 42 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, గత జనవరితో పోలిస్తే ఇది ఐదు శాతం మేర పడిపోయింది. జూలై 1 నుంచి ఆగస్టు 25 మధ్య దాదాపు 25 వేల మందికి పైగా ఓటర్ల నుంచి ప్రత్యక్షంగా అభిప్రాయాలను సేకరించి ఈ సర్వే నిర్వహించారు. ఇందులో యూపీ రాజకీయాలలో చోటుచేసుకున్న ఈ అనూహ్య మార్పునకు పలు కీలక అంశాలు కారణంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ తీసుకొచ్చిన నూతన నిబంధనలు విద్యా రంగంలో తీవ్ర ఆందోళనలకు దారితీశాయి. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన ఇబ్బందులు పాత మండల్ కమిషన్ రోజులను గుర్తుచేస్తున్నాయని తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు అయోధ్య రామాలయ నిధుల వివాదం కూడా మోదీ, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాల ప్రతిష్ఠను కొంత మేర దెబ్బతీసిందని సర్వే నివేదిక వెల్లడించింది. ఇదే ట్రెండ్ కొనసాగితే మాత్రం వచ్చే ఏడాది ఇక్కడ జరిగే అసెంబ్లీ ఎన్నికలతో పాటు, 2029లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి గడ్డుకాలం తప్పదన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.














Click it and Unblock the Notifications