చట్టం తినమని చెబుతుంటే.. గోవధపై నిషేధమా?: గందరగోళంగా కేంద్రం నిర్ణయం
గోమాంసం నిషేధం, కబేళాల నిషేధం రాష్ట్రాల పరిధిలోని అంశం కావడంతోనే కేంద్రం ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాలిటీ టువర్డ్స్ యానిమల్స్ చట్టాన్ని ఆశ్రయించింది.
న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన గోవధ నిషేధంపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీ సర్కార్ ఉద్దేశపూర్వకంగానే ఒక వర్గాన్ని టార్గెట్ చేసి మరీ.. గోమాంసంపై నిషేధం విధించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కేరళ, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాల్లో గోమాంస నిషేధంపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తగా.. దానికి తోడు కేంద్రం తీసుకున్న నిర్ణయంలోను గందరగోళానికి తావిచ్చే అంశాలున్నాయి.
కేంద్ర పర్యావరణ శాఖ ఇచ్చిన వివరణలో.. ఆహారం కోసం జంతువులను హతమార్చడంలో తప్పులేదని పేర్కొనడం గమనార్హం. జంతువులను హింస నుంచి రక్షించే చట్టం కిందనే ఆంక్షలు తీసుకొచ్చామని, దీనివల్ల సమైక్య స్ఫూర్తికి ఎలాంటి విఘాతం కలగదని పర్యావరణ శాఖ స్పష్టం చేసింది.
కాగా, పశుమాంసం అమ్మకాల అంశం రాష్ట్రాల పరిధిలోనిది. ఇందులో కేంద్రం జోక్యం చేసుకునే హక్కు లేదు. ఈ నేపథ్యంలోనే బీజేపీ సర్కార్.. తమ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గోమాంస నిషేధ చట్టాలను తెచ్చింది. క్రూరత్వం, హింస నుంచి గోవులను రక్షించే చట్టాన్ని(ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాలిటీ టువర్డ్స్ యానిమల్స్) చేయడం ద్వారా కేంద్రం గోమాంసంపై నిషేధం విధించింది.
దీనికి సంబంధించిన చట్టంలో 22వ నిబంధన కింద పశువుల సంతలో పశువులను వ్యవసాయ అవసరాల కోసం మాత్రమే తీసుకుంటున్నట్లు కొనుగోలు, విక్రయదారుల నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకోవాలంటూ ఆంక్షలు విధించారు. అదే చట్టంలోని 11వ సెక్షన్(ఈ) నిబంధనను గమనిస్తే.. పశువులను అకారణంగా హింసించనంత కాలం వాటిని ఆహారం కోసం చంపడంలో ఎలాంటి తప్పు లేదని అందులో పొందుపరిచారు.
ఆహారం కోసం జంతువులను వధించవచ్చునని చట్టం ఇంత స్పష్టంగా చెబుతుంటే.. వాటిని కబేళాలలకు తరలించరాదనే నిబంధన ఎలా చెల్లుతుందనేది సెక్యులరిస్టులు లేవనెత్తుతున్న ప్రశ్న. దేశవ్యాప్తంగా గోమాంసం నిషేధించాలనే ఆర్ఎస్ఎస్ డిమాండ్ ను నెత్తికెత్తుకోవడమే బీజేపీ తీసుకున్న నిర్ణయానికి కారణంగా చెప్పుకుంటున్నారు.
గోమాంసం నిషేధం, కబేళాల నిషేధం రాష్ట్రాల పరిధిలోని అంశం కావడంతోనే కేంద్రం ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాలిటీ టువర్డ్స్ యానిమల్స్ చట్టాన్ని ఆశ్రయించింది. ఆ చట్టం కింద పశుమాంసం క్రయవిక్రయాలను అడ్డుకునే హక్కు కేంద్రానికి లేకపోవడం వల్ల బీజేపీ సర్కార్ మధ్యేమార్గాన్ని అనుసరించినట్లు స్పష్టమవుతోంది.
అలా కాకుండా.. గోమాంసాన్ని నిషేధించాలంటే కేంద్రం రాజ్యాంగ సవరణ చేయాలి. అది జరగాలంటే.. పశుమాంస ఉత్పత్తుల వల్ల ఉపాధి పొందుతున్న వారి సమస్యలను, మొత్తం గోమాంస పర్యవసనాలకు కేంద్రం బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కేంద్రం ఆ దిశగా నిర్ణయం తీసుకోకుండా.. ఇలా మధ్యే మార్గాన్ని అనుసరించింది.
కాగా, యూపీలో పశుమాంసం నిషేధించడం వల్ల పరిశ్రమ స్తంభించిపోవడం వల్ల ఏడాదికి 56వేల కోట్ల రూపాయాలు నష్టం వాటిల్లుతుందని తెలుస్తోంది.