రిపబ్లిక్ డేపై కేంద్రం కీలక నిర్ణయం-జనవరి 23 నుంచే వేడుకలు-నేతాజీ జయంతితో పాటు
ఏటా ఢిల్లీలో నిర్విహంచే రిపబ్లిక్ డే వేడుకలపై కేంద్రం ఈసారి కీలక నిర్ణయం తీసుకోబోతోంది. ఇప్పటివరకూ జనవరి 24న ప్రారంభమయ్యే రిపబ్లిక్ డే వేడుకలు జనవరి 26న ముగుస్తుండగా... దాని స్ధానంలో జనవరి 23 నుంచే ఈ వేడుకలు నిర్వహించాలని భావిస్తోంది.
ప్రతీ సంవత్సరం జనవరి 23న నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి నిర్వహిస్తున్నారు. ఈ మధ్య మోడీ సర్కార్ ఈ రోజును పరాక్రమ్ దివస్ గా ప్రకటించి మరింత ఘనంగా వేడుకలు నిర్వహిస్తోంది. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీతో పోరులో భాగంగా నేతాజీని బీజేపీ గౌరవిస్తోందనే ప్రచారంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుది. దీంతో జనవరి 23న పరాక్రమ్ దివస్ వస్తోంది. ఆ తర్వాత జనవరి 24 నుంచి ఎలాగో రిపబ్లిక్ డే సన్నాహక వేడుకలు ప్రారంభమవుతున్నాయి.
దీంతో కేంద్రం జనవరి 24కు బదులు జనవరి 23 నుంచే ఈ వేడుకలు ప్రారంభించాలని భావిస్తోంది. అలా చేస్తే జనవరి 23న నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి నుంచే రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించడం ద్వారా ఆయన్ను గౌరవిస్తున్నట్లు చెప్పుకోవచ్చేనేది కేంద్ర ప్రభుత్వ ఆలోచనగా ఉంది.
నేతాజీ బోస్ మేనల్లుడు చంద్ర కుమార్ బోస్ ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో ఎన్డీయే సర్కార్ తీసుకున్న నిర్ణయాలను దేశ ప్రజలు అభినందిస్తున్నారని ఆయన తెలిపారు. కానీ నేతాజీ ప్రవచించిన సమ్మిళిత సిద్ధాంతాన్ని అమలు చేయడం అంతకంటే ముఖ్యమని చంద్రకుమార్ బోస్ తెలిపారు. మతంతో సంబంధం లేకుండాభారతీయులుగా ప్రజల్ని ఏకం చేయడమే దీని ఉద్దేశం.
నేతాజీ సమ్మిళిత సిద్ధాంతాన్ని అమలు చేయని పక్షంలో భారతదేశం మళ్లీ విచ్ఛిన్నమవుతుందని చంద్రబోస్ అన్నారు. మనం ఇప్పటికే భారత్, బెంగాల్ విభజన చూశామని, నేతాజీ భారతదేశానికి తిరిగి వచ్చి ఉంటే, విభజన జరిగేది కాదని ఆయన తెలిపారు. కానీ భారతదేశం మళ్లీ విచ్ఛిన్నమవుతోందని, విభజన రాజకీయాలు ఆగిపోవాలని, మత సామరస్యం ఉండాలని చంద్రబోస్ కోరారు.