పాక్పై విజయం: 'ప్రపంచ కప్ నెగ్గామా? సంబరాలు చేసుకోడానికి'
న్యూఢిల్లీ: ఐసీసీ వరల్డ్ కప్లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్ధాన్పై టీమిండియా సాధించిన ఘనవిజయానికి యావత్ దేశం సంబరాలను జరుపుకున్న విషయం తెలిసిందే. క్రికెట్ అభిమానులు వీధుల్లోకి వచ్చి బాణసంచా పేల్చి వారి సంతోషాన్ని పంచుకున్నారు. రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని మోడీ పాక్పై విజయం సాధించినందుకు శుభాకాంక్షలు తెలిపారు.
అయితే విజయాన్ని సాధించిన టీమిండియా మాత్రం సంబరాలను జరుపుకోలేదు. అడిలైడ్లో ఆదివారం నాడు పాకిస్ధాన్తో మ్యాచ్ జరిగిన అనంతరం భారత ఆటగాళ్లు హోటల్ గదులకే పరిమితమయ్యారు. వరల్డ్ కప్లోనే హై ఓల్టేజ్ మ్యాచ్ ఆడిన టీమిండియా ఆటగాళ్లు అలసిపోవడంతో విశ్రాంతి తీసుకున్నట్లు సమాచారం.
'ప్రపంచ కప్ లో ఓ మ్యాచ్ లో మాత్రమే గెలిచాం. పాక్ పై నెగ్గినందుకు ప్రతి ఒక్కరూ సంతోషించారు. ఈ ఒక్క విజయానికే మేం సంబరాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. మేమేయినా ప్రపంచ కప్ నెగ్గామా?' అని భారత సహాయక బృందం సభ్యుడొకరు తెలిపాడు.
ఆదివారం రాత్రి విశ్రాంతి తీసుకున్న టీమిండియా సోమవారం ఉదయం అడిలైడ్ నుంచి మెల్ బోర్న్కు క్వాంటస్ విమానంలో చేరుకుంది. రెండు రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత తదుపరి మ్యాచ్కి ప్రాక్టీస్ మొదలుపెట్టనున్నారు. కెప్టెన్ ధోని, టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రి యువ ఆటగాళ్లపై ఏమాత్రం ఒత్తిడిని పడకుండా జాగ్రత్తపడుతున్నారు.
వరల్డ్ కప్లో టీమిండియా ఫిబ్రవరి 22న టోర్నీలో బలమైన మరో జట్టు దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఇరు జట్లు కూడా టోర్నమెంట్లో తమ తొలి మ్యాచ్ల్లో విజయాన్ని సాధించాయి. ఒకే రోజు జరిగిన మ్యాచ్ల్లో పాకిస్ధాన్పై భారత్ గెలుపొందగా, జింబాబ్వేపై దక్షిణాఫ్రికా విజయం సాధించింది.