నన్ గ్యాంగ్ రేప్: నలుగురు బంగ్లాదేశీయుల అరెస్టు
లూథియానా: నన్ గ్యాంగ్ రేప్ కేసులో పోలీసులు మరింత పురోగతి సాధించారు. పంజాబ్ పోలీసులు నలుగురు బంగ్లాదేశీయులను అదుపులోకి తీసుకున్నారు. సంఘటన తర్వాత పశ్చిమ బెంగాల్ నుంచి పారిపోయిన అ నలుగురిని లూథియానాలో పట్టుకున్నారు.
వివిధ రకాలుగా సమాచారం అందుకున్న పోలీసులు ఆ నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరింత సమాచారం కోసం వారిని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. పశ్చిమ బెంగాల్ నేర దర్యాప్తు విభాగం బృందం వారిని తమ కస్టడీకి తీసుకునే అవకాశం ఉంది.
ఈ నలుగురి అరెస్టుతో నన్ గ్యాంగ్ రేప్ కేసులో ఇప్పటి వరకు అరెస్టు చేసినవారి సంఖ్య ఆరుకు చెరుకుది. గత వారం సిఐడి అధికారులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మొహమ్మద్ సలీం అనే వ్యక్తిని ముంబైలో, గోపాల్ సర్కార్ అనే వ్యక్తిని పశ్చిమ బెంగాల్లోని నార్త్ పరగణాలో అరెస్టు చేశారు.
నేరానికి పాల్పడినవారు ఏడుగురు అని సిఐడి భావిస్తోంది. అరెస్టయిన ఆరుగురు కూడా బంగ్లాదేశ్కు చెందినవారే. సలీం పాత నేరస్థుడని చెబుతున్నారు. కాగా, సర్కార్ 2002లో బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్లోకి చొరబడి పెయింటర్గా పనిచేస్తున్నాడు.
నిందితులకు సర్కార్ తన ఇంటిలో ఆశ్రయం కల్పించినట్లు చెబుతున్నారు. అతని భార్య కూడా ఆ విషయాన్ని ధ్రువీకరించిందని సిఐడి అధికారులు చెప్పారు. సిసిటీవీ ఫుటేజీలో వారిని ఆమె గుర్తించింది.
తాము దోపిడీ మాత్రమే చేయాలని అనుకున్నామని, అయితే తమను అడ్డగించడంతో నన్పై అత్యాచారం చేశామని నిందితులు సిఐడి అధికారులకు చెప్పినట్లు సమాచారం. పథకం వేసింది మిలన్ భాయ్ అనే వ్యక్తి అని కూడా వారు చెప్పినట్లు తెలుస్తోంది.