1 రూపాయి జమ: సుప్రీంకోర్టు విధించిన ఫైన్ కట్టిన ప్రశాంత్ భూషణ్, తీర్పు అప్పీల్..
కోర్టు ధిక్కారణకు పాల్పడిన ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ జరిమానా చెల్లించారు. ఇవాళ సుప్రీంకోర్టులో ఫైన్ కట్టిన ఆయన.. తర్వాత మీడియాతో మాట్లాడారు. అయితే తాను కోర్టు తీర్పును మాత్రం స్వాగతించడం లేదని చెప్పారు. కోర్టు ధిక్కరణ కింద తనకు రూపాయి జరిమానా విధించడంపై రివ్యూ పిటిషన్ వేశానని తెలిపారు.
కోర్టులో జరిమానా జమ చేస్తుంటే.. తాను తీర్పును గౌరవించినట్టు కాదు అని స్పష్టంచేశారు. తనకు ఉన్న హక్కు ప్రకారం తీర్పును రివ్యూ చేశానన్నారు. అంతేకాదు తన పిటిషన్ను ఇదివరకటీ కన్నా విసృత, భిన్న ధర్మాసనం విచారించాలని కోరతానని చెప్పారు. ఢిల్లీ అల్లర్ల కేసులో జేఎన్యూ విద్యార్థి ఉమర్ ఖలీద్ను పోలీసులు అరెస్ట్ చేయడంపై కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. దీంతోపాటు సుప్రీంకోర్టు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఏ బొబ్డేను విమర్శిస్తూ ప్రశాంత్ భూషణ్ ట్వీట్ చేశారు. దానిని సుప్రీంకోర్టు ధర్మాసనం ధిక్కారంగా పరిగణించింది. పిటిషన్ విచారించి ఆయనన దోషిగా తేల్చింది.
Recommended Video
ప్రశాంత్ భూషణ్కు సుప్రీంకోర్టు రూపాయి జరిమానా విధిస్తూ ఆగస్ట్ 31వ తేదీన తీర్పునిచ్చిది. సెప్టెంబర్ 15వ తేదీ లోపు జరిమానా చెల్లించాలని ఆదేశించింది. జరిమానా చెల్లించకపోతే మూడు నెలల జైలు శిక్ష విధించాలని, దాంతోపాటు మూడేళ్లు న్యాయవాద వృత్తిని మానేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇవాళ ఆయన జరిమానా చెల్లించారు.
జరిమానా చెల్లించడానికి ఒక్క రూపాయి క్యాంపెయిన్ నిర్వహించానని ప్రశాంత్ భూషణ్ తెలిపారు. పలువురి నుంచి విరాళాలు సేకరించామన్నారు. తన పక్కనున్న వ్యక్తి నుంచి రూపాయి నాణెం తీసి పట్టుకుని మాట్లాడారు. ప్రజలు ఇచ్చిన ప్రతి రూపాయితో వేధింపులకు గురయ్యే వారికి ట్రూత్ ఫండ్ ద్వారా సహాయం చేయడానికి ఉపయోగిస్తాం వెల్లడించారు.