ఉగ్రవాదుల దాడిలో గురుదాస్పూర్ ఎస్పీ మృతి
గురుదాస్పూర్: పంజాబ్ రాష్ట్రంలోని దీనానగర్ పోలీస్ స్టేషన్ వద్ద ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో గురుదాస్పూర్ ఎస్పీ భల్జీత్ సింగ్ మృతి చెందారు. ఎస్పీ డిటెక్టివ్ విభాగంలో పని చేస్తున్నారు. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు కూడా హతమయ్యారు.
ఉగ్రవాదులకు, పోలీసులకు మధ్య కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. ఉగ్రవాదుల్లో ఓ మహిళా ఉగ్రవాది కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సోమవారం ఉదయం 5.45గంటల నుంచి కాల్పులు జరుగుతూనే ఉన్నాయి.
ఉగ్రవాదుల కాల్పుల్లో మొత్తం 11మంది మృతి చెందగా, పోలీసుల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. కాగా, ఉగ్రవాద ఘటన దురదృష్టకరమని పంజాబ్ సిఎం ప్రకాశ్ సింగ్ బాదల్ అన్నారు. ఇది జాతీయ సమస్య అని, రాష్ట్ర సమస్య కాదని చెప్పారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు జాతీయ విధానం అవసరమని బాదల్ అన్నారు.

గురుదాస్పూర్ ఘటన దురదృష్టకరం: జితేందర్రెడ్డి
పంజాబ్లో ఉగ్రవాదులు దాడులు చేయడం దారుణమని టిఆర్ఎస్ ఎంపీ జితేందర్రెడ్డి పేర్కొన్నారు. లోక్సభలో జితేందర్రెడ్డి మాట్లాడుతూ.. గురుదాస్పూర్ దీనానగర్ ఘటన దురదృష్టకరమన్నారు. ఘటనపై పూర్తి వివరాలు సభకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. ఘటనపై హోంశాఖ త్వరగా ప్రకటన చేయాలన్నారు.
పార్లమెంట్ వద్ద భారీ భద్రత
పంజాబ్లో ఉగ్రవాదుల దాడుల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఐబీ హైఅలర్ట్ ప్రకటించింది. ఐబీ హెచ్చరికల నేపథ్యంలో పార్లమెంట్ వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. భారత సరిహద్దు వెంబడి బీఎస్ఎఫ్, ఆర్మీ భద్రతను కట్టుదిట్టం చేసింది. సరిహద్దుల్లో బలగాలు నిఘా పెంచాయి.
సరిహద్దుల్లో పాక్ బలగాల కాల్పులు
కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్థాన్ మరోసారి ఉల్లంఘించింది. జమ్మూ సెక్టార్ వెంబడి పాక్ బలగాలు కాల్పులు జరుపుతున్నాయి. పాక్ కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోంది. సరిహద్దుల్లో ఉన్న గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.












Click it and Unblock the Notifications