Rahul Gandhi : కేసు నమోదు చేయండి- రాహుల్కు హైకోర్టు షాక్..!!
కాంగ్రెస్ అగ్రనేత,లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పౌరసత్వంపై సాగుతున్న వివాదం మరో కీలక మలుపు తిరిగింది. రాహుల్ గాంధీకి బ్రిటీష్ పౌరసత్వం ఉందన్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ విచారణను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వమే స్వయంగా చేపట్టవచ్చు లేదా ఏదైనా కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించవచ్చని కోర్టు స్పష్టం చేసింది.
అసలేమిటీ కేసు?
కర్ణాటకకు చెందిన బిజెపి కార్యకర్త ఎస్.విఘ్నేష్ శిశిర్ ఈ వివాదంపై న్యాయపోరాటం చేస్తున్నారు. రాహుల్ గాంధీ బ్రిటీష్ పౌరసత్వాన్ని కలిగి ఉన్నారని,దీనివల్ల ఆయన భారతదేశంలో ఎన్నికల్లో పోటీ చేయడానికి గానీ,లోక్సభ సభ్యుడిగా కొనసాగడానికి గానీ అనర్హుడని పిటిషనర్ వాదిస్తున్నారు.తన వాదనకు మద్దతుగా బ్రిటీష్ ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని పత్రాలు ఈమెయిల్స్ తన వద్ద ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

ఈ కేసు తొలుత రాయ్బరేలీలోని ప్రత్యేక ఎంపీ/ఎమ్మెల్యే కోర్టులో దాఖలైంది.ఆతర్వాత డిసెంబర్ 17, 2025న హైకోర్టు ఈ కేసును లక్నోకు బదిలీ చేసింది.జనవరి 28న లక్నోలోని ప్రత్యేక ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు ఈ పిటిషన్ను తిరస్కరించింది.పౌరసత్వానికి సంబంధించిన అంశాలను తేల్చే అధికారం తమకు లేదని ఆ కోర్టు అభిప్రాయపడింది.దిగువ కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ విఘ్నేష్ శిశిర్ హైకోర్టును ఆశ్రయించారు.దీంతో హైకోర్టు జోక్యం చేసుకుంది.ఈ ఆరోపణలు తీవ్రమైనవని భావించిన హైకోర్టు,ఇప్పుడు విచారణకు ఆదేశించింది.
పిటిషనర్ ఆరోపిస్తున్న సెక్షన్లు
పిటిషనర్ రాహుల్ గాంధీపై కేవలం పౌరసత్వమే కాకుండా పలు తీవ్రమైన సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేయాలని కోరారు.భారతీయ న్యాయ సంహిత (BNS) నిబంధనలు.అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ (అధికారిక రహస్యాల చట్టం),ఫారినర్స్ యాక్ట్ (విదేశీయుల చట్టం),పాస్పోర్ట్ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని కోరారు. తన కేసును విచారణకు తీసుకున్న హైకోర్టుకు విఘ్నేష్ ధన్యవాదాలు తెలిపారు.తన దగ్గర అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టే తాను న్యాయపోరాటానికి దిగినట్లు స్పష్టం చేశారు.
లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీకి ఈ విచారణ ఒక పెద్ద సవాల్గా మారే అవకాశం ఉంది. ఒకవేళ విచారణలో పౌరసత్వానికి సంబంధించిన ఆరోపణలు నిజమని తేలితే, అది ఆయన రాజకీయ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ కేసును ఏ ఏజెన్సీకి అప్పగిస్తుందనేది రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది.













Click it and Unblock the Notifications