తెరుచుకున్న శబరిమల అయ్యప్ప ఆలయం: రేపట్నుంచే భక్తులకు అనుమతి, నిబంధనలు
తిరువనంతపురం: అయ్యప్ప భక్తులకు ఇది శుభవార్త. భక్తుల సందర్శనార్థం శబరిమల అయ్యప్ప ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. సోమవారం నవంబర్ 15న గర్భగుడిని ప్రధాన అర్చకులు తెరిచి పూజలు నిర్వహించారు. భక్తుల సందర్శించేందుకు నవంబర్ 16 నుంచి అనుమతి ఉంటుందని ఆలయ నిర్వాహకులు వెల్లడించారు.
దీక్ష తీసుకుని అయ్యప్ప స్వామి వారి దర్శనం కోసం వచ్చే భక్తుల కోసం రెండు నెలల పాటు ఆలయం తెరిచే ఉంటుందని ఆలయ నిర్వాహకులు స్పష్టం చేశారు. మండల మకరవిళక్కు పండగ సీజన్ సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రోజుకు 30 వేల మంది భక్తులను మాత్రమే అనుమతించాలని అధికారులు ఆదేశించారు.
నవంబర్ 16వ తేదీ నుంచి ఆలయంలోకి భక్తులకు అనుమతి ఇస్తుండగా.. డిసెంబర్ 26న శబరిమలలో మండలపూజ ముగియనుంది. డిసెంబర్ 30న మకరవిళక్కు కోసం ఆలయం తెరుచుకోనుంది. జనవరి 14వ తేదీన మకరజ్యోతి దర్శనం తరువాత జనవరి 20న ఆలయాన్ని మళ్లీ మూసివేయనున్నారు అధికారులు. అయ్యప్ప స్వామి దర్శనానికి వచ్చే భక్తులు కొన్ని మార్గదర్శకాలను పాటించాల్సిందేనని దేవస్థాన అధికారులు స్పష్టంచేశారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు హెల్త్ చెకప్ చేయించుకుని ఆలయానికి రావాలి. ఒరిజినల్ ఆధార్ తప్పనిసరిగా చూపించాలి. పంపాలో స్నానానికి అనుమతి ఉంటుంది. కానీ, సన్నిధానంలో బస చేసేందుకు మాత్రం అనుమతులు లేవని దేవస్థానం స్పష్టం చేసింది.
పంపాలో వాహనాలకు పార్కింగ్ వసతి ఉండదు. వాహనాలకు నీలక్కల్ వరకే అనుమతిస్తారు. అక్కడి నుంచి ప్రభుత్వ బస్సులు అందుబాటులో ఉంటాయి. దర్శనం ముగించుకున్న వెంటనే ఆలయ ప్రాంగణం నుంచి వెళ్లిపోవాలి. కాలి నడకన వచ్చే భక్తులు.. స్వామి అయ్యప్పన్ రోడ్డును మాత్రమే ఉపయోగించుకోవాలి. నెయ్యాభిషేకం కోసం భక్తులు తీసుకొచ్చే నెయ్యిని సేకరించేందుకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారని, అక్కడే నెయ్యిని తిరిగి ఇస్తారని, దర్శనం తర్వాత ప్రసాదం కోసం పంపా వద్ద ఏర్పాట్లు చేశారు. శబరిమల ఆలయ దర్శనానికి వచ్చే వారు కచ్చితంగా వ్యాక్సిన్ సర్టిఫికేట్ లేదా కరోనా టెస్ట్ (ఆర్టీపీసీఆర్) నెగిటివ్ రిపోర్ట్ తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు.