మత మార్పిళ్లు తీవ్రమైన అంశం-రాజకీయ రంగు పులమొద్దు-సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్న మత మార్పిడులపై సుప్రీంకోర్టు ఇవాళ మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వీటిని వ్యతిరేకిస్తూ దాఖలైన ఓ పిటిషన్ పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఇది తీవ్రమైన అంశమని వ్యాఖ్యానించింది. అలాగే వాటికి రాజకీయ రంగు పులమొద్దని కూడా సూచించింది.
తమిళనాడులో మత మార్పిళ్లను అడ్డుకోవాలని కోరుతూ బీజేపీ అధికార ప్రతినిధి అయిన లాయర్ అశ్వినీ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది విల్సన్ అభ్యంతరం తెలిపారు. పిటిషనర్ బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్నారని, ఇది రాజకీయ ప్రేరేపితమైన కేసు అని వాదించారు. దీనిపై సుప్రీంకోర్టులో జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సీటీ రవికుమార్ ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా మత మార్పిళ్లు తీవ్రమైన అంశమని, దీనికి రాజకీయ రంగు పులమొద్దని ఆయనకు సూచించింది.

తమిళనాడులో ఎలాంటి బలవంతపు మతమార్పిళ్లు చోటు చేసుకోవడం లేదని, అందుకే 2002 నాటి మత మార్పిళ్ల నిరోధ చట్టాన్ని కూడా ప్రభుత్వం వెనక్కి తీసుకుందని తమిళనాడు న్యాయవాది విల్సన్ సుప్రీంకోర్టుకు తెలిపారు. ఈ అంశాన్ని చట్టసభలకు వదిలేయాలని ఆయన కోరారు. తమిళనాడులో ఎలాంటి మత మార్పిళ్ల భయం లేదన్నారు. దీనిపై స్పందించిన సుప్రీం న్యాయమూర్తులు.. మీ రాష్ట్రంలో మత మార్పిళ్లు జరగకపోతే మంచిదే, మేం దేశవ్యాప్తంగా ఉన్న పరిస్ధితి గురించి చెబుతున్నామన్నారు. అలాగే ఈ పిటిషన్ కు రాజకీయ రంగు పులమాల్సిన అవసరం కూడా లేదని తెలిపారు. అయితే ఈ కేసుకు ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా కేంద్రం అభిప్రాయం చెప్పాలని సుప్రీం ధర్మాసనం అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణిని కోరింది.












Click it and Unblock the Notifications