ప్రతీ నెలా రూ.100కోట్ల వసూళ్లు... హోంమంత్రిపై సీబీఐ దర్యాప్తుకు సుప్రీం ఆదేశిస్తుందా..? రేపే విచారణ...
మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ అవినీతి కార్యకలాపాలపై సీబీఐ విచారణ జరిపించాలంటూ ముంబై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ వీర్ సింగ్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ను కోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై బుధవారం(మార్చి 24) విచారణ చేపట్టనుంది. తనపై మహారాష్ట్ర ప్రభుత్వం బదిలీ వేటు వేయడాన్ని కూడా ఆయన ఈ పిటిషన్లో సవాల్ చేశారు.
'మహా'రాజకీయాల్లో లెటర్ బాంబ్ దుమారం... హోంమంత్రిని తప్పిస్తారా... ఉద్దవ్ ఏం చేయబోతున్నారు?
పోలీస్ అధికారి పరమ్ వీర్ సింగ్ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్పై సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ప్రతీ నెలా రూ.100 కోట్లు వసూలు చేసివ్వాలని ముంబై క్రైమ్ ఇంటలిజెన్స్ యూనిట్ హెడ్గా పనిచేసిన సచిన్ వాజేకు అనిల్ దేశ్ముఖ్ టార్గెట్ ఫిక్స్ చేశారని ఆరోపించారు. ఇదే విషయంపై పలుమార్లు తన అధికారిక నివాసానికి పిలిపించుకుని సచిన్ వాజేతో మాట్లాడారని చెప్పారు. ఈ మేరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రేకి ఆయన లేఖ రాశారు.
పరమ్ వీర్ సింగ్ చేసిన ఈ ఆరోపణలు మహారాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారం రేపాయి. అవనీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అనిల్ దేశ్ముఖ్ పదవి నుంచి తప్పుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే కూడా హోంమంత్రిపై వేటు వేసేందుకు సిద్దమవుతున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ మీడియా ముందుకొచ్చి.. అనిల్ దేశ్ముఖ్ పదవిలో కొనసాగుతారని స్పష్టం చేశారు. పరమ్ వీర్ సింగ్ ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు.
ప్రతీ నెలా రూ.100కోట్లు వసూలు చేయాలని హోంమంత్రి ఆర్డర్... ముంబై మాజీ పోలీస్ బాస్ సంచలన ఆరోపణలు...
ఫిబ్రవరి నెల మధ్యలో సచిన్ వాజేని అనిల్ దేశ్ముఖ్ తన కార్యాలయానికి పిలిపించుకుని వసూళ్ల గురించి మాట్లాడారని పరమ్ వీర్ సింగ్ చేసిన వ్యాఖ్యలను శరద్ పవార్ ఖండించారు. ఫిబ్రవరి 6 నుంచి ఫిబ్రవరి 16 వరకూ అనిల్ దేశ్ముఖ్ కరోనా కారణంగా ఆస్పత్రిలోనే ఉన్నారని తెలిపారు. కాబట్టి పరమ్ వీర్ సింగ్ ఆరోపణలు నిరాధారమని పేర్కొన్నారు.
అంబానీ ఇంటి వద్ద బాంబు కలకలం కేసులో అనుమానితుడిగా సచిన్ వాజేని ఎన్ఐఏ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన సమయంలో ముంబై కమిషనర్గా ఉన్న పరమ్ వీర్ సింగ్పై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. అయితే పరమ్ వీర్ సింగ్ మాత్రం అకారణంగా తనపై వేటు వేశారని ఆరోపిస్తున్నారు. ఇదే క్రమంలో హోంమంత్రిపై అవినీతి ఆరోపణలతో ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ఇప్పుడీ విషయం సుప్రీం కోర్టు పరిధిలోకి వెళ్లడంతో అత్యున్నత న్యాయస్థానం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.