హనీప్రీత్తో సహ అరెస్టైన నిందితులను అరెస్ట్ చేయాలి: బిజెపి ఎమ్మెల్యే
పంచకుల అల్లర్ల కేసులో అరెస్టైన వారిలో హనీప్రీత్ సింగ్తో సహ అందరినీ విడుదల చేయాలని బిజెపి ఎమ్మెల్యే కుల్వంత్ బాజీగార్ డిమాండ్ చేశారు. మరో స్వతంత్ర ఎమ్మెల్యే కూడ ఆయనకు మద్దతుగా నిలిచారు.
న్యూఢిల్లీ: పంచకుల అల్లర్ల కేసులో అరెస్టైన వారిలో హనీప్రీత్ సింగ్తో సహ అందరినీ విడుదల చేయాలని బిజెపి ఎమ్మెల్యే కుల్వంత్ బాజీగార్ డిమాండ్ చేశారు.
పంచకుల అల్లర్లలో నష్టపోయిన వారి కుటుంబాలకు పరిహారం ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుతం జైల్లో ఉన్న డేరాబాబా శిష్యురాలు, వివాదాస్పద దత్తపుత్రిక హనీప్రీత్ సింగ్ను కూడా ఆయన వెనకేసుకొచ్చారు. హనీప్రీత్ సహా పంచకుల అల్లర్ల కేసులో అరెస్టైన డేరాబాబా అనుచరులందర్నీ వెంటనే విడుదల చేయాలని కోరారు.
''వాళ్లంతా అమాయకులు.. బూటకపు కేసులు బనాయించి వారిని అరెస్టు చేశారు...'' అని ఎమ్మెల్యే కుల్వంత్ వ్యాఖ్యానించారు. కాగా ఆయనకు మరో స్వతంత్ర ఎమ్మెల్యే జైప్రకాశ్ మద్దతు పలికారు. బాబా రామ్పాల్, డేరాచీఫ్ గుర్మీత్ సింగ్ తదితరులపై కేసులు వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే ఈ అంశం కోర్టు పరిథిలో ఉందనీ... దీనిపై ఎవరూ ఏమీ మాట్లాడడానికి లేదని ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సూచించారు.
ఇద్దరు సాధ్విలపై అత్యాచారానికి పాల్పడిన కేసుల్లో డేరాబాబాకు 20 యేళ్ల జైలు శిక్ష పడింది. . ఆగస్టు 25న పంచకుల సీబీఐ కోర్టు డేరాబాబాను దోషిగా తేలుస్తూ తీర్పు చెప్పిన కొద్ది సేపటికే.. పంచకులలో భారీ ఎత్తున అల్లర్లు చెలరేగాయి.
42 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. దాదాపు రూ. 200 కోట్లకు పైగా ప్రభుత్వ ఆస్తులు నష్టం వాటిల్లింది. ఈ అల్లర్ల వెనుక డేరాబాబా వివాదాస్పద దత్తపుత్రిక హనీప్రీత్ సహా పలువురు డేరా నిర్వాహకుల హస్తం ఉందంటూ పోలీసులు కేసు నమోదు చేశారు.