మమతాకు షాక్: బీజేపీలోకి తృణమూల్ కాంగ్రెస్ టాప్ లీడర్..!
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి మరో షాక్ తగలనుంది. గత శుక్రవారం ఆమె కేబినెట్లోని మంత్రి మంజుల్ కృష్ణ థాకూర్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలోకి చేరిన విషయం తెలిసిందే.
తాజాగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, కేంద్ర మాజీ రైల్వే శాఖ మంత్రి దినేశ్ త్రివేది కూడా త్వరలో బీజేపీలోకి చేరనున్నట్లు అక్కడి మీడియా కోడై కూస్తుంది. 64 ఏళ్ల దినేశ్ త్రివేది పశ్చిమ బెంగాల్లోని కోల్కత్తా కి సమీపంలో ఉన్న బర్కాపూర్ నియోజక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి పార్టీ మెంబర్గా కొనసాగుతున్నారు.
భారత మాజీ ప్రధాని మన్మోహాన్ సింగ్ ప్రభుత్వ హయాంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా పనిచేశారు. 2012 రైల్వే బడ్జెట్లో రైల్వే ఛార్జీలను పెంచినందుకు గాను మరుక్షణమే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆదేశాలతో రాజీనామా చేసిన త్రివేది అప్పటి నుంచి పార్టీ వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
ఈ నేపథ్యంలో ఆయన బీజేపీ నేతలతో టచ్లో ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల గుజరాత్లో ప్రధాని నరేంద్రమోడీ సోదరుడు సోమాభాయ్ మోడీతో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడి స్ధానిక మీడియాతో మాట్లాడుతూ మోడీ గొప్ప విజన్ కలిగిన నేతగా కొనియాడారు. 1990 నుంచి ప్రధాని మోడీ తనకు మంచి మిత్రుడుని తెలిపారు.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో బీజేపీ క్రమంగా బలపడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్న సీఎం మమతా బెనర్జీ, త్రివేది కూడా బీజేపీలో చేరితే ఆమెకు గట్టి షాక్ తగులుతుంది.