ఎన్నికల ర్యాలీలు, రోడ్ షోలు పెడితే కష్టమే-ఈసీకి కోవిడ్ టాస్క్ ఫోర్స్ హెచ్చరిక
2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్ గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు త్వరలో జరగాల్సి ఉంది. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అటు రాజకీయ పార్టీలు కూడా ప్రచార ర్యాలీలతో హోరెత్తిస్తున్నాయి. ఇలాంటి సమయంలో జాతీయ కోవిడ్ టాస్క్ ఫోర్స్ వీరందరికీ షాకింగ్ న్యూస్ చెప్పింది.
ప్రస్తుత పరిస్ధితుల్లో ఎన్నికల ప్రచార ర్యాలీలు నిర్వహించడం కోవిడ్ పరిస్ధితిని మరింత తీవ్రం చేస్తుందని జాతీయ కోవిడ్ టాస్క్ ఫోర్స్ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పుడు ఎన్నికల ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహిస్తే కరోనా మరింత ప్రబలే ప్రమాదంం ఉందని ఎన్నికల సంఘానికి జాతీయ కోవిడ్ టాస్క్ ఫోర్స్ ఛైర్మన్ వీకే పౌల్ తెలిపారు. దీంతో వీటి కట్టడికి తగిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి ఆయన సూచించారు.
మరోవైపు ప్రస్తుత పరిస్ధితుల్లో ఎన్నికల ర్యాలీలు, రోడ్ షోల నిర్వహణపై రాజకీయపార్టీలు తమంతట తామే నిర్ణయాలు తీసుకోవాలని ఎన్నికల సంఘం కోరింది. తద్వారా తాము జోక్యం చేసుకోకముందే స్వచ్చంధంగా వీటిని కట్టడి చేయాలని సలహా ఇచ్చింది. పరిస్దితి విషమించిన తర్వాత ఎవరూ చేయగలిగేది ఏమీ ఉండదని చెప్పకనే చెప్పింది. ఇప్పటికే యూపీ సహా ఇతర ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు తమ ర్యాలీలు, రోడ్ షోలు రద్దు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా యూపీలో తమ ర్యాలీలు రద్దు చేసుకోవడంతో పాటు బీజేపీ ర్యాలీలు రద్దు చేయాలని ఈసీని కోరుతోంది.
Recommended Video
ఎన్నికలు జరిగే ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, మణిపూర్లలో రాజకీయ పార్టీలు వాస్తవ పరిస్దితుల ఆధారంగా సన్నద్ధం కావాలని, వ్యాక్సిన్లు వేచించుకోవాలని కూడా ఈసీ ఇప్పటికే కోరింది. కానీ వేగంగా వ్యాప్తి చెందుతున్న ఓమిక్రాన్ వేరియంట్ ఈ సమయంలో ఎన్నికల నిర్వహణపై ఆందోళనలకు కారణమవుతోంది. పరిస్ధితి మరింత ముదిరితే ఎన్నికలు వాయిదా వేయడం మినహా ఈసీ కూడా చేయలగిదిందేమీ లేదనే వాదన వినిపిస్తోంది.