దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్ కన్నుమూత.. భార్య చనిపోయిన 5 రోజులకే.. మోడీ నివాళి..
కరోనా వైరస్ భారత దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్ను బలి తీసుకుంది. ఐదు రోజుల క్రితం ఆయన భార్య నిర్మల్ కౌర్ కూడా కరోనాతో చనిపోయిన సంగతి తెలిసిందే. మిల్కా సింగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో మృతిచెందారు. మే 20వ తేదీన మిల్కాసింగ్కు కరోనా వైరస్ సోకింది. కరోనా సోకిన తొలినాళ్లల్లో చండీగఢ్లోని తన ఇంట్లో చికిత్స పొందారు. అనంతరం ముందస్తు జాగ్రత్తగా ఆస్పత్రిలో చేర్పించారు. నెలరోజుల పాటు కరోనాతో పోరాడుతూ ఈ నెల 3వ తేదీన మిల్కా సింగ్ ఐసీయూలో చేరారు. చివరకు ఆరోగ్యం విషమించి ఆయన తుదిశ్వాస విడిచారు. మిల్కా సింగ్ మృతిపై ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు.
రాజపుత్రుల కుటుంబంలో జననం
1932 నవంబర్ 20న పాక్ పంజాబ్లోని గోవింద్పురలో మిల్కాసింగ్ జన్మించారు. సిక్రాథోడ్ రాజపుత్రుల కుటుంబంలో జన్మించిన మిల్కాసింగ్.. 1951లో భారత సైన్యంలో చేరారు. ఆర్మీ నిర్వహించిన పరుగులపోటీలో మిల్కాసింగ్ ఆరో స్థానంలో నిలిచారు. అనంతరం అథ్లెట్గా మారారు. మిల్కాసింగ్కు హైదరాబాద్తో విడదీయరాని అనుబంధం ఉంది. సికింద్రాబాద్లో మిల్కాసింగ్ 9 ఏళ్లపాటు శిక్షణ పొందారు. అనంతరం 1958 కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం గెలిచి సత్తా చాటాడు. 1958 టోక్యో, 1962 జకార్తా ఆసియా క్రీడల్లో నాలుగు స్వర్ణాలు నెగ్గారు. 1960 రోమ్ ఒలింపిక్స్లో 400 మీటర్ల విభాగంలో నాలుగో స్థానంలో నిలిచారు. ట్రాక్పై ఆయన చూపిన తెగువతో అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.
భార్య కూడా...
మిల్కాసింగ్ భార్య నిర్మల్ కౌర్ కరోనా వైరస్తో పోరాడుతూ జూన్ 14వ తేదీన మృతి చెందిన విషయం తెలిసిందే. భార్య మృతి చెందిన ఐదు రోజులకే ఆయన కన్నుమూయడంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది. ఆయన మృతితో క్రీడాలోకం మూగబోయింది. మరణవార్త తెలియగానే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. గొప్పవ్యక్తిని కోల్పోయామని.. కుటుంబానికి సంతాపం వ్యక్తం చేశారు.
అదే ఆస్పత్రిలో
మిల్కా సింగ్ భార్య,, భారత వాలీవాల్ మాజీ కెప్టెన్ నిర్మల్ మిల్కా సింగ్ కోవిద్-19 తో కన్ను మూశారు. ఆమె వయస్సు 85 ఏళ్ళు.. గత నెలలో ఆమెకి కరోనా పాజిటివ్ సోకగా ఆమెను చండీ గఢ్ లోని ప్రైవేటు ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ వచ్చినా ఆమె ఆరోగ్యం విషమించి ఆదివారం మధ్యాహ్నం కన్ను మూశారు. కరోనాతో మిల్కా సింగ్ కూడా ఇదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగు పడుతున్నట్టు డాక్టర్లు తెలిపారు. వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ఆయన తన భార్య అంత్యక్రియలకు హాజరు కాలేకపోయారని కుటుంబ సభ్జ్యులు తెలిపారు.
సంతాపం
నిర్మల్ మిల్కా సింగ్ పంజాబ్ ప్రభుత్వంలో మాజీ స్పోర్ట్స్ డైరెక్టర్ కూడా.. అలాగే భారత మహిళా నేషనల్ వాలీబాల్ టీమ్ కెప్టెన్ గా కూడా ఆమె వ్యవహరించారు. 1955లో నిర్మల్ శ్రీలంకకు కూడా వెళ్లి అక్కడ మహిళా వాలీబాల్ పోటీల్లో పాల్గొన్నారు. నేషనల్, ఇంటర్నేషనల్ పోటీల్లో ఆమె స్కర్ట్స్ బదులు సల్వార్-కమీజ్ లు ధరించి అందరి దృష్టినీ ఆకర్షించారు. మిల్కా సింగ్ ఆరోగ్యం కుదుట పడుతున్న నేపథ్యంలో ఆయనను కొన్ని రోజుల్లో డిశ్చార్జ్ చేయవచ్చునని డాక్టర్లు తెలిపారు. కానీ ఇంతలోనే ఆయన మరణించారు.