41 శాతం ఆదాయం రాష్ట్రాలకే.. పెట్రో ధరలపై కేంద్ర-రాష్ట్రాలు సమీక్షించాలి: నిర్మల
పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి. ప్రతీ రోజు ఆయిల్ సంస్థలు ధరలు సమీక్షించి.. ఎంతో కొంత వాయిస్తోన్నాయి. దీంతో పెట్రో ధర సెంచరీ మార్క్నకు చేరువగా ఉంది. పెట్రో ధరలు.. పన్నులపై సోషల్ మీడియాలో నెటిజన్లు తెగ పోస్టులు పెడుతున్నారు. కేంద్రం పన్ను, రాష్ట్రాల పన్నులతో సామాన్యుడి జేబుకు చిల్లుపడుతోంది. దీనిపై ఆందోళన వ్యక్తమవుతోన్నా.. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం దిగిరావడం లేదు.
Recommended Video
పెట్రోల్ ధరలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. పెట్రోల్ ధరలపై రాష్ట్రాలు కూడా ఆలోచించాలని ఆమె కోరారు. అవసరమైతే కేంద్రంతో చర్చలు చేయాలని సూచించారు. పెట్రోల్పై కేంద్రంతోపాటు రాష్ట్రాలు కూడా పన్నులు వేస్తున్నాయని అన్నారు. కేంద్ర రాష్ట్రాల మధ్య చర్చలు మంచి ఫలితాలు ఇవ్వవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం జరిగిన ఐడబ్ల్యూపీసీ ప్రెసర్లో ఆమె మాట్లాడారు.
పెట్రో ధరల పెరుగుదల అనేది కేంద్ర రాష్ట్రాలకు సంబంధించిన విషయం చెప్పాలి అని నిర్మలా సీతారామన్ వివరించారు. కేంద్ర ప్రభుత్వమే పన్నులు వేస్తోందని అనుకోవద్దన్నారు. రాష్ట్రాలు కూడా పెట్రోల్పై పన్నులు వేస్తున్నాయని చెప్పారు. పెట్రోల్పై కేంద్రానికి వచ్చే ఆదాయంలో రాష్ట్రాలకు 41 శాతం వెళ్తుందని చెప్పారు. దీనిపై కేంద్ర రాష్ట్రాల మధ్య చర్చలు జరగడం అవసరం అని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. డిస్కషన్స్ జరిగితే పన్నులపై ఏకాభిప్రాయం రావొచ్చని అభిప్రాయపడ్డారు. ఇదీ త్వరలో రూపం దాల్చే అవకాశం ఉంది అని నిర్మలా సీతారామన్ తెలిపారు.