సునంద మర్డర్ మిస్టరీ: సహజ మరణంగా చిత్రీకరిస్తూ నివేదిక
న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ సతీమణి సునంద పుష్కర్ హత్య కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసుకు సంబంధించి ఫోరెన్సిక్ నివేదిక ఇచ్చిన డాక్టర్ సుధీర్ గుప్తా చీఫ్ విజిలెన్స్ కమిషన్కు లేఖ రాశారు.
సునంద మరణాన్ని సహజ మరణంగా చిత్రీకరిస్తూ నివేదిక ఇవ్వాలంటూ ఎయిమ్స్ డైరెక్టర్, గత ప్రభుత్వ పెద్దలు తనపై ఒత్తిడి తీసుకొచ్చారని తన లేఖలో సుధీర్ గుప్తా పేర్కొన్నారు. సునంద మృతి చెందినప్పుడు డాక్టర్ సుధీర్ గుప్తా ఎయిమ్స్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ హెడ్గా ఉన్నారు.
అయితే, డాక్టర్ సుధీర్ గుప్తా ఆరోపణలను ఎయిమ్స్ డైరెక్టర్ ఖండించారు. సునంద పుష్కర్ ఢిల్లీలోని ఓ హోటల్లో అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. మొదట ఆమె ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు భావించారు. అయితే పోలీసుల దర్యాప్తులో కేసు కీలక మలుపు తిరిగింది.
కేసు దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీసులు కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ వ్యక్తిగత సహాయకుడు నారాయణ సింగ్, డ్రైవర్ భజరంగి, స్నేహితుడు సంజయ్ ధావన్లకు అన్ని వివరాలు తెలిసినప్పటికి దర్యాప్తుకు సహకరించడం లేదని పోలీసులు అంటున్నారు.
ఆ ముగ్గురు కేసు దర్యాప్తులో కీలమైన వ్యక్తులని, వారు సరైన సమాధానాలు వెల్లడిస్తే కేసు దర్యాప్తు కొలక్కి వస్తుందని ఢిల్లీ పోలీసులు అంటున్నారు. ఈ ముగ్గురిని ఎన్ని సార్లు విచారణ చేసినా సరైన సమాధానలు చెప్పడం లేదని పోలీసులు అంటున్నారు.
వారికి లైవ్ డిటెక్టర్ పరీక్షలు నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.