రేప్ బాధితులకు సుప్రీంకోర్టు ఊరట-రెండు వేళ్ల పరీక్ష నిషేధం-అశాస్త్రీయమని వెల్లడి
దేశవ్యాప్తంగా అత్యాచార బాధితులకు ఊరటనిచ్చేలా సుప్రీంకోర్టు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ అత్యాచార బాధితుల్ని నిర్దారించేందుకు డాక్టర్లు నిర్వహిస్తున్న రెండు వేళ్ల పరీక్షను నిషేధిస్తూ కీలక తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
ఓ రేప్ కేసులో రెండు వేళ్ల పరీక్ష ద్వారా బాధితురాలికి రేప్ జరగలేదని డాక్టర్లు ఇచ్చిన రిపోర్ట్ ను నిర్ధారిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. బాధితురాలు తాజాగా సెక్స్ లో పాల్గొందా లేదా అనేది నిర్ధారించేందుకు మాత్రమే ఈ రెండు వేళ్ల పరీక్ష ఉపయోగపడుతోంది. బాధితురాలి ప్రైవేట్ భాగాల్లో కండరాల పటుత్వాన్ని బట్టి ఆమె తరచుగా సెక్స్ లో పాల్గొంటుందా లేదా అన్నది డాక్టర్లు రెండు వేళ్లు పెట్టడం ద్వారా నిర్దారిస్తున్నారు. అయితే ఇది ఆమె జననాంగాల్లోని హైమన్ పొరను నిర్ధారించేందుకు మాత్రమే ఉపయోగపడుతోంది.
దీంతో తెలంగాణలోని ఓ రేప్ బాధితురాలికి జరిపిన ఈ రెండు వేళ్ల పరీక్షలో నిర్ధారణ కాలేదన్న సాకుతో హైకోర్టు ఇచ్చిన తీర్పును జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హిమాకొహ్లీతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. ఇకపై రెండు వేళ్ల పరీక్షను నిషేధిస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. ఇకపై ఈ పద్ధతిలో ఎవరైనా పరీక్షలు నిర్వహిస్తే చట్టప్రకారం చర్యలు తప్పవని సుప్రీం ధర్మాసనం హెచ్చరించింది. దేశంలో ఇంత శాస్త్రీయ పరిజ్ఞానం అభివృద్ధి చెందిన రోజుల్లో ఇలాంటి పరీక్షలు నిర్వహించడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఈ విధానం వల్ల రేప్ బాధితురాలి సమస్య తీరకపోగా.. వాళ్లను మరోసారి బాధితులుగా మారుస్తుందని తెలిపింది.