Karnataka Hijab Ban : కర్నాటక హిజాబ్ తీర్పుపై సుప్రీం ధర్మాసనంలో చీలిక-ఛీఫ్ జస్టిస్ కోర్టులో బంతి..
కర్నాటకలో హిజాబ్ ను నిషేధిస్తూ అక్కడి బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. తీర్పు వెలువరించే విషయంలో మాత్రం రెండుగా చీలిపోయింది. ఈ తీర్పుపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో సుప్రీంకోర్టు ధర్మాసనం నిబంధనల ప్రకారం ఈ వ్యవహారాన్ని ఛీఫ్ జస్టిస్ కు అప్పగించింది.
కర్నాటక హిజాబ్ నిషేధాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లను జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ సుధాన్షు ధులియా నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారించింది అయితే హిజాబ్ నిషేధానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను జస్టిస్ హేమంత్ గుప్తా కొట్టివేయగా, జస్టిస్ సుధాన్షు ధులియా వాటిని అనుమతించారు. దీంతో తీర్పులో చీలిక అనివార్యమైంది. దీనిపై జస్టిస్ సుధాన్షు ధులియా.. ఇది అంతిమంగా ఎంపికకు సంబంధించిన విషయమన్నారు. తన మనస్సులో ఆడపిల్లల విద్య ఉన్నతమైనదని పేర్కొన్నారు. కాబట్టి తాను తన సోదర న్యాయమూర్తితో గౌరవంగా విభేదిస్తున్నానంటూ జస్టిస్ ధులియా వ్యాఖ్యనించారు.
అనంతరం హిజాబ్ నిషేధంపై తీర్పు విషయంలో న్యాయమూర్తుల మధ్య అభిప్రాయ భేదాలున్నట్లు జస్టిస్ గుప్తా తెలిపారు. గతంలో కర్నాటక హైకోర్టు పిటిషనర్లను వారి అభ్యర్థనను కొట్టివేసే ముందు 11 ప్రశ్నలు అడిగారని, కాబట్టి తాను హైకోర్టు ఆదేశాలతో ఏకీభవిస్తున్నట్లు చెప్పారు. దీంతో ఈ వ్యవహారంపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ కు బదలాయించాల్సిన పరిస్దితి ఏర్పడింది. గతంలో కర్నాటక హైకోర్టు ప్రభుత్వ నిర్ణయం ప్రకారం హిజాబ్ నిషేధాన్ని సమర్ధించింది.