Tamil Nadu Verdict: తమిళనాట సీన్ రివర్స్-డీఎంకేకు షాకిచ్చిన తాజా సర్వే..!
తమిళనాడు అసెంబ్లీకి ఈ నెల 23న జరిగే అసెంబ్లీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ నెలకున్న విభిన్న పరిస్ధితులే ఇందుకు కారణం. ఓవైపు ఐదేళ్ల పాటు ప్రభుత్వాన్ని నడిపి మరోసారి ప్రజాతీర్పు కోరుతున్న టీఎంకే కూటమి, ఇంకోవైపు బీజేపీతో కలిసి అధికారంలోకి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్న అన్నాడీఎంకే కూటమి, చివరిగా వీరిద్దరికీ గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్న విజయ్ కొత్త పార్టీ టీవీకే. ఈ ముగ్గురిలో ఈసారి ఓటర్లు ఎవరిని ఆదరించబోతున్నారనే అంశంపై ఇప్పటికే పలు సర్వేలు వెలువడగా.. ఇప్పుడు వాటికి విరుద్ధంగా మరో సర్వే వచ్చింది.
234 సీట్లు ఉన్న తమిళనాడు అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో ఈసారి ప్రభుత్వ మార్పు ఖాయమని జేవీసీ పోల్ తాజా సర్వేలో నిర్ధారణ అయింది. తమిళ ఓటర్లు ఈసారి డీఎంకే కూటమి స్ధానంలో విపక్ష అన్నాడీఎంకేకు మద్దతుగా నిలుస్తున్నారని ఈ సర్వేలో తేలింది. అన్నాడీఎంకే-బీజేపీ కూటమికి ఈసారి 13-150 సీట్లు దక్కడం ఖాయమని జేవీసీ పోల్ సర్వే తెలిపింది. అధికార డీఎంకే కూటమికి కేవలం 80-101 సీట్లు మాత్రమే లభిస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది. అలాగే విజయ్ పార్టీ టీవీకే కేవలం 2-4 సీట్లు గెలుస్తుందని తేల్చింది.

అన్నాడీఎంకే కూటమి ఈసారి 40.1 శాతం నుంచి 41.2 శాతం ఓట్లను సాధించి అధికారంలోకి రాబోతున్నట్లు జేవీసీ పోల్ సర్వే తెలిపింది. అలాగే డీఎంకే కూటమి ఈసారి 36.1 శాతం నుంచి 38.5శాతం ఓట్లు మాత్రమే సాధిస్తున్నట్లు ఈ సర్వే వెల్లడించింది. విజయ్ పార్టీ టీవీకేకు 15.2 శాతం నుంచి 16.1 శాతం ఓట్లు లభిస్తున్నట్లు ఈ సర్వే పేర్కొంది. ఎన్టీకేకు 4.2 శాతం నుంచి 4.5 శాతం ఓట్లు వస్తున్నా ఒక్క సీటు కూడా గెలవడం కష్టమని తెలిపింది.

ఈసారి డీఎంకే కూటమికి మిత్రపక్షాలైన కాంగ్రెస్, కమ్యూనిస్టులు ప్రభావం చూపలేకపోవడమే కారణమని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా రైతులు డీఎంకే కూటమి ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నట్లు వెల్లడించింది. వీరంతా అన్నాడీఎంకే-బీజేపీ కూటమి వైపు మొగ్గుతున్నట్లు తెలిపింది. అలాగే విజయ్ పార్టీ టీవీకే ఓటర్లలో 55-60 శాతం ఉన్న 40 ఏళ్లు పైబడిన వారిని మెప్పించలేకపోయినట్లు తెలిపింది. యువ ఓటర్లలో మాత్రం విజయ్ పార్టీకి ఆదరణ ఉందని, అది సీట్ల రూపంలోకి మారడం లేదని పేర్కొంది.












Click it and Unblock the Notifications