దీపావళి టపాసులపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ.. ఎందుకంటే!!
దేశవ్యాప్తంగా దీపావళి పర్వదినాన్ని అందరూ ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా దీపావళి పండుగ అంటే గుర్తొచ్చేది దీపాల వెలుగులు, టపాసుల జిలుగులు. అయితే దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో దీపావళి పర్వదినాన బాణాసంచా కాల్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పర్యావరణానికి పెనుముప్పు టపాసుల వల్ల కలుగుతుందని బాణాసంచా విషయంలో అనేక రాష్ట్రాలు కీలక నిర్ణయాన్ని తీసుకుంటున్నాయి.
గత కొన్నేళ్లుగా దేశ రాజధాని ఢిల్లీలో విపరీతంగా పెరిగిన పర్యావరణ కాలుష్యం నేపథ్యంలో బాణాసంచా అమ్మకాలపై నిషేధాన్ని విధిస్తూ ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంటుంది. ఈ సంవత్సరం కూడా ఢిల్లీ ప్రభుత్వం సెప్టెంబర్ 7న అన్ని రకాల టపాసుల ఉత్పత్తి, నిల్వ, అమ్మకం మరియు వాడకాన్ని నిషేధించింది. బాణసంచాపై నిషేధం జనవరి 1, 2023 వరకు కొనసాగుతుందని ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది. ఇక ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని నివారించడం కోసం ఆప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కోర్టుకు వెళ్లిన బీజేపీ నేతకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. దేశ రాజధాని ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం విధించిన బాణాసంచా నిషేధాన్ని ఎత్తివేయడానికి సుప్రీంకోర్టు సైతం నిరాకరించింది.
ఇదిలా ఉంటే దీపావళి రోజున బాణసంచా అమ్మకాలను అనుమతించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ రాశారు. దేశరాజధానిలో దీపావళి పండుగ రోజున అనుమతించదగిన నిబంధనల ప్రకారం టపాసుల అమ్మకాలు అనుమతించాలని కోరుతూ ఢిల్లీ సీఎంకు ఆయన లేఖ రాశారు. తమిళనాడులోని శివకాశి టపాసుల కర్మాగారాలకు వార్షిక ఆదాయంలో 70శాతం దీపావళి రోజున టపాసుల అమ్మకం ద్వారానే వస్తుందని ఆయన తెలిపారు.
తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలోని శివకాశి నగరం భారతదేశంలో బాణసంచా తయారీదారుల కేంద్రంగా ప్రసిద్ధి చెందిందని పేర్కొన్న ఎంకే స్టాలిన్ ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా 6.5 లక్షల కుటుంబాలు తమ జీవనోపాధి కోసం ఈ పరిశ్రమపై ఆధారపడి ఉన్నాయని తన లేఖలో స్పష్టం చేశారు. అందుకే ఢిల్లీలో బాణాసంచా విక్రయాలకు, పరిమితి మేరకు టపాసులు కాల్చడానికి అనుమతి ఇవ్వాలంటూ ఆయన లేఖలో పేర్కొన్నారు.