కావేరీ బోర్డు: ఏప్రిల్ 5న తమిళనాడు బంద్కు విపక్షాల పిలుపు, అన్నాడిఎంకె దీక్షలు
చెన్నై: కావేరీ బోర్డు ఏర్పాటు విషయంలో కేంద్రం ఆలస్యం చేయడాన్ని నిరసిస్తూ ఏప్రిల్ 5న తమిళనాడు బంద్ చేయాలని విపక్షాలు నిర్ణయం తీసుకొన్నాయి. ఆదివారం నాడు డిఎంకె నేతృత్వంలో విపక్షాలు చెన్నైలో సమావేశమయ్యాయి. ఈ సమావేశంలో తమిళనాడు బంద్ చేపట్టాలని నిర్ణయం తీసుకొన్నాయి.
కావేరీ బోర్డు ఏర్పాటు చేయనందుకు ఏప్రిల్ 5న, తమిళనాడు బంద్కు విపక్షాల నిర్ణయం తీసుకొన్నాయి. కావేరీ బోర్డును ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ ఆదేశాలు జారీ చేసి సుమారు 6 వారాలు దాటినా కూడ కేంద్రం ఈ విషయంలో మౌనంగా ఉండడంపై తమిళనాడులోని పలు రాజకీయ పార్టీలు ఆందోళన చేస్తున్నాయి.
పార్లమెంట్లో ఈ విషయమై అన్నాడిఎంకె ఎంపీలు ఆందోళన చేస్తున్నారు. ఈ సమయంలో ఆదివారం నాడు డిఎంకె ఆధ్వర్యంలో విపక్ష పార్టీలు సమావేశం నిర్వహించాయి.ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ ఏప్రిల్ 5న తమిళనాడు బంద్ నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్నాయి.
మరో వైపు జల్లికట్టు తరహలోనే కావేరీ బోర్డు ఏర్పాటు విషయంలో కూడ పోరాటాన్ని సాగించాలని పార్టీలు ప్రజలను కోరాయి. మేరీనాబీచ్లో ఉద్యమాన్ని నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్నాయి .కర్ణాటక రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికలు ఉన్నందున రాజకీయంగా నష్టం వాటిల్లకుండా ఉండాలనే ఉద్దేశ్యంతోనే కేంద్రం ఈ విషయంలో నోరు మెదపడం లేదని డిఎంకె నేతలు ఆరోపిస్తున్నారు.
ఏప్రిల్ 11న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తమిళనాడు రాష్ట్ర పర్యటనకు రానున్నారు. చెన్నైలో పలు కార్యక్రమాల్లో పాల్గోంటారు.ఈ సందర్భంగా నరేంద్ర మోడీ పర్యటనను నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలు ప్రదర్శించాలని స్టాలిన్ పార్టీ కార్యకర్తలకు సూచించారు.
మరోవైపు కేంద్రం వైఖరిని నిరిస్తూ అధికార అన్నాడిఎంకె పార్టీ కూడ తమిళనాడు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో నిరహరదీక్షల్లో పాల్గొనాలని సూచించింది.
ఈ ఏడాది ఫిబ్రవరి 16న కావేరీ బోర్డును ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. కావేరీ నదీ జలాలను తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు పంచుకొనేందుకు వీలుగా ఈ బోర్డును ఏర్పాటు చేయాలని సూచించింది. సుప్రీంకోర్టు విధించిన ఆరు వారాల గడువు గురువారానికే పూర్తైంది.
అయితే కేంద్రం సుప్రీం కోర్టు ఆదేశాలను ఖాతరు చేయలేదని ఆరోపిస్తూ కోర్టు ధిక్కారానికి పాల్పడిందని తమిళనాడు ప్రభుత్వం కేంద్రంపై శనివారం నాడు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.