Tik tok ban ..అఖిల పక్ష భేటీలో ప్రధాని మోడీకి కేంద్రమంత్రుల డిమాండ్.!!
భారతదేశంలో టిక్ టాక్ ను బ్యాన్ చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది. భారత్-చైనా సరిహద్దు వివాదాల మధ్య దేశంలో చైనా ఉత్పత్తులు వాడకూడదని,చైనీస్ యాప్ లను నిషేధించాలని పెద్ద ఎత్తున బాయ్ కాట్ చైనా క్యాంపెయిన్ కొనసాగుతోంది. ఇక ఈ సమయంలో అటు ప్రజలు నుండే కాకుండా,రాజకీయ పార్టీల నుండి, కేంద్రంలోని అధికార పార్టీ నేతల నుండి, ఏకంగా కేంద్రమంత్రి నుండి కూడా టిక్ టాక్ బ్యాన్ నినాదం వినిపించడం ఆసక్తికరంగా మారింది.
బాయ్ కాట్ చైనా ప్రొడక్ట్స్ .. సోషల్ మీడియా ఉద్యమం బానే ఉన్నా .. రియాల్టీ ఇదే !!
అఖిలపక్ష భేటీలో టిక్ టాక్ పై ఆసక్తికర చర్చ
భారత్-చైనా సరిహద్దు వద్ద నెలకొన్న ఉద్రిక్తత నేపథ్యంలో చైనా విషయంలో ఏం చేద్దాం అన్నదానిపై అఖిలపక్ష భేటీ నిర్వహించారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇక ఈ అఖిలపక్ష భేటీలో పలు కీలక అంశాలను చర్చించారు భేటీలో పాల్గొన్న రాజకీయ పార్టీల నాయకులు. అఖిలపక్ష సమావేశంలో కేంద్ర మంత్రి టిక్ టాక్ వంటి యాప్ లను మరియు చైనా ఉత్పత్తులను దేశం నుంచి నిషేధించాలని ప్రధాని నరేంద్ర మోడీని అభ్యర్థించారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ప్రజలు గో చైనా గో అంటూ చైనీస్ యాప్స్ విషయంలో, ప్రొడక్ట్స్ విషయంలో నిషేధం కోసం పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు.
టిక్ టాక్ ను నిషేధించాలని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే డిమాండ్
చైనా ఆర్థిక వ్యవస్థ ను దెబ్బతీసేందుకు, చైనా యాప్ అయిన టిక్ టాక్ ను నిషేధించాలని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది టిక్ టాక్ ను దాదాపు 15 మిలియన్ల భారతీయులు వినియోగిస్తున్నారని, ఇక ఈ యాప్ ద్వారా చైనా కోట్ల రూపాయల లాభాలను ఆర్జిస్తున్నదని పేర్కొన్న మంత్రి టిక్ టాక్ ను నిషేధించాలని ప్రధాని మోడీని కోరారు. ఇక సమావేశంలో రాందాస్ తో పాటుగా మరి కొందరు మంత్రులు కూడా టిక్ టాక్ బ్యాన్ కోసం ప్రధాని మోడీ కి తమ విజ్ఞప్తిని తెలియజేసినట్లుగా సమాచారం. ఇక రాందాస్ అథవాలే ప్రజలకు కూడా టిక్ టాక్ వాడవద్దు అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. చైనా విషయంలో తన అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.
చైనాను ఆర్థికంగా దెబ్బతీయడానికి భారత్ వ్యూహ రచన
ఇక మరో పక్క భారత్-చైనా సరిహద్దు నెలకొన్న ఉద్రిక్తత పై భారత్ తీవ్ర ఆగ్రహంతో ఉన్న సమయంలో చైనాను ఆర్థికంగా దెబ్బతీయడానికి భారత్ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు వంద రకాల చైనా ఉత్పత్తులపై నిషేధం విధించాలని కూడా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే 5జి తో పాటు ఎలాంటి ఇతర కాంట్రాక్టులను చైనా కంపెనీలు సొంతం చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని ఆలోచిస్తున్న ప్రభుత్వం, ఇప్పటికే బిఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ లో ఆధునీకరణలో భాగంగా చైనా పరికరాలను ఉపయోగించకూడదని టెలికాం మంత్రిత్వశాఖకు ఇప్పటికే ఆదేశించింది. ఇక కేంద్ర మంత్రుల నుండి కూడా విజ్ఞప్తులు వినిపిస్తున్న వేళ ప్రభుత్వ ఏ నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.