ఇవాళ పార్లమెంట్ హైలెట్స్ : లోక్ సభలో కీలక ప్రకటనలు-రాజ్యసభలో ఎంపీల సస్పెన్షన్ రచ్చ
ఇవాళ పార్లమెంటు శీతాకాల సమావేశాల రెండో రోజు సమావేశాల్లోనూ రచ్చ తప్పలేదు. ప్రభుత్వం కీలకమైన బిల్లులు ప్రవేశపెట్టేందుకు సంకేతాలు ఇచ్చింది. అదే సమయంలో విపక్షాలు నిన్న 12 మంది రాజ్యసభ ఎంపీల్ని సస్పెండ్ చేస్తూ ఛైర్మన్ వెంకయ్యనాయుడు తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ ఆందోళనలు చేపట్టాయి. దీంతో ఉభయసభల్లో రచ్చ తప్పలేదు.
లోక్ సభలో ప్రభుత్వం పలు కీలకమైన ప్రకటనలు చేసింది. శీతాకాల సమావేశాల రెండోరోజు లోక్ సభలో ప్రభుత్వం... ఈ సమావేశాల్లో క్రిప్టో కరెన్సీ బిల్లు ప్రవేశపెట్టబోతున్నట్లు వెల్లడించింది. అలాగే ఎన్నార్సీ తయారీపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని కూడా క్లారిటీ ఇచ్చింది. అలాగే ఓమిక్రాన్ వైరస్ కేసు భారత్ లో ఒక్కటి కూడా నమోదు కాలేదని కూడా లోక్ సభలో ప్రకటించింది. అదే సమయంలో రైతు సమస్యలు, పెగాసస్ పై చర్చలు కోరుతూ విపక్షాలు నిరసనలకు దిగాయి. దీంతో లోక్ సభ పలుమార్లు వాయిదా పడింది.
అటు రాజ్యసభను మాత్రం ఎంపీల సస్పెన్షన్ వివాదం కుదిపేసింది. 12 మంది రాజ్యసభ సభ్యులపై నిన్న విధించిన సస్పెన్షన్ ఎత్తేయాలని విపక్షం పట్టుబట్టింది. అయితే ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఇందుకు అంగీకరింలేదు. సభలో వెంకయ్య దీనిపై చర్చకు కూడా అవకాశం ఇవ్వకపోవడంతో విపక్షం వాకౌట్ చేసింది. అనంతరం బయటికి వచ్చిన విపక్షాలు వెంకయ్యతో చర్చలు జరిపినా ఆయన మాత్రం వెనక్కి తగ్గలేదు. సస్పెండైన ఎంపీలు తమ ప్రవర్తనపై పశ్చాతాపం కూడా వ్యక్తం చేయకపోవడం, దేశం ఆవేదన చెందుతుండటంతో తాను సస్పెన్షన్ పై వెనక్కి తగ్గలేనన్నారు. ఇది సభ తీసుకున్న నిర్ణయం అని చెప్పేశారు. దీంతో సస్పెండైన ఎంపీలు రేపటి నుంచి పార్లమెంట్ బయట ధర్నాలు చేపట్టాలని నిర్ణయించారు.అనంతరం ఇరు సభలు కూడా విపక్షాల నిరసనల మధ్యే రేపటికి వాయిదా పడ్డాయి.

పార్లమెంటులో ఇవాళ హైలెట్స్
- లోక్ సభలో కేంద్రం కీలక ప్రకటనలు- దేశంలో ఓమిక్రాన్ కేసుల్లేవు, ఎన్నార్సీ అమలు చేయట్లేదు
- రాజ్యసభలో ఎంపీల సస్పెన్షన్ రచ్చ, వెనక్కి తీసుకోవాలని కోరిన విపక్షాలు, అంగీకరించని ఛైర్మన్
- రేపటి నుంచి సస్పెండైన ఎంపీలు పార్లమెంటు బయట ధర్నాలకు నిర్ణయం
- రాజ్యసభ ఛైర్మన్ తీరుతో విపక్షాల వాకౌట్
- లోక్ సభలో ప్రభుత్వానికి సహకరించాలని కాంగ్రెస్, టీఎంసీ నిర్ణయం
- ఉభయసభలు రేపటికి వాయిదా












Click it and Unblock the Notifications