బీహార్ ఎగ్జిట్ పోల్స్: మహా కూటమి, ఎన్డిఎ హోరాహోరీ
న్యూఢిల్లీ: బీహార్ ప్రజలు మహా కూటమికి స్వల్పంగా ఆధిక్యం లభించే అవకాశాలున్నట్లు ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఇదే విషయాన్ని చెబుతున్నాయి. అయితే, వివిధ కూటములకు వచ్చే సీట్లలో మాత్రం తేడాను చూపిస్తున్నాయి. టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం జెడియూ నేతృత్వంలోని మహా కూటమికి 112 - 123 సీట్లు వస్తాయి.
ఇండియా టుడే - సిసిరో సంస్తలు నిర్వహించిన సర్వేలో మాత్రం ఎన్డిఎకు ఆధిక్యం లభిస్తుందని తేలింది. ఎన్డిఎకు 120 స్థానాలు, మహా కూటమికి 117 స్థానాలు వస్తాయని ఆ సర్వే తేల్చింది. బీహార్లో మొత్తం 243 శాసనసభా స్థానాలకు పోలింగ్ జరిగింది.
తుది విడత పోలింగ్ గురువారం జరిగింది. గురువారం భారీగా ఓట్లు పోలయ్యాయి. మహా కూటమికి 122 సీట్లు, ఎన్డిఎకు 111 సీట్లు వస్తాయని, ఇతరులు 10 స్థానాలు గెలుచుకుంటారని టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్ తెలియజేస్తోంది.
న్యూస్ ఎక్స్ ఎగ్జిట్ పోల్ ప్రకారం - ఎన్డిఎకు 90 నుంచి 100 స్థానాలు వస్తాయి. మహా కూటమికి 130 నుంచి 140 స్థానాలు వస్తాయి. ఇతరులు 13 నుంచి 23 స్థానాలు గెలుచుకుంటారు. బీహార్ శాసనసభ ఎన్నికల ఫలితాలు ఈ నెల 8వ తేదీన వెల్లడి కానున్నాయి.
మహా కూటమికి 190 స్థానాలు వస్తాయని ఆర్జెడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. ప్రధాని మోడీ సంఘ్ పరివార్ ప్రచారక్లా వ్యవహరిస్తున్నారని ఆయన గురువారం సాయంత్రం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. బిజెపి 40 స్థానాలకే పరిమితమవుతుందని చెప్పారు.